మంత్రి పొన్నం ప్రమేయంతోనే వందల కోట్ల స్కామ్‌ .. బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

రామగుండం ఎన్టీపీసీ నుంచి హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు సరైన వైబిల్స్ లేకుండా రవాణ చట్టాలను ఉల్లంఘిస్తూ బూడిద లోడ్ లారీలు అక్రమ రవాణ సాగిస్తున్నాయని, ఇందులో వందల కోట్ల స్కామ్ దాగి ఉందని, తద్వారా ఖజానాకు భారీ గండి పడుతుందని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు

  • Publish Date - June 8, 2024 / 04:30 PM IST

రవాణ చట్టాలకు తిలోదకాలు
మంత్రి పొన్నం ప్రమేయంతోనే వందల కోట్ల స్కామ్‌
బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపణలు
మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్‌

విధాత : రామగుండం ఎన్టీపీసీ నుంచి హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు సరైన వైబిల్స్ లేకుండా రవాణ చట్టాలను ఉల్లంఘిస్తూ బూడిద లోడ్ లారీలు అక్రమ రవాణ సాగిస్తున్నాయని, ఇందులో వందల కోట్ల స్కామ్ దాగి ఉందని, తద్వారా ఖజానాకు భారీ గండి పడుతుందని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఆయన స్థానిక మీడియాకు స్కామ్ ఆరోపణలను వివరిస్తూ, ట్విటర్ వేదికగా వీడియో విడుదల చేశారు. కొన్ని లారీలకు వేబిల్స్ లేవని, మరికొన్ని లారీలకు 32టన్నులకు వేబిల్స్ తీసుకుని 70టన్నుల వరకు ఓవర్ లోడ్‌తో బూడిదను అక్రమ రవాణ చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి పొన్నం ఆదేశాల మేరకే ఈ అక్రమ రవాణ సాగుతుందని, తద్వారా లారీ యజమానుల నుంచి రోజుకు 50 లక్షల చొప్పున మంత్రి పొన్నంకు అందుతుందని, ఇందులో వంద కోట్ల స్కామ్ చేశారని, వెంటనే మంత్రిని బర్తరఫ్ చేసి విచారణ జరిపించాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధిక లోడుతో రోజుకు 300 బూడిద లారీలు వెళ్తున్నాయని, దీనికోసం వేబిల్ 32టన్నులకు 25వేలు కట్టి, మిగతా ఓవర్ లోడ్‌లకు సంబంధించి సగటున రోజుకు 50 లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వెళ్తున్నాయని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. లైవ్ ఆధారాలతో సహా తాను బూడిద రవాణాలో చట్టాల ఉల్లంఘనతో జరుగుతున్న స్కామ్‌ను బయటపెట్టానని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

Latest News