కాంగ్రెస్లో.. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి: కోనేరు కోనప్ప

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. 2023ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ లో చేరడం జరిగిందని..అక్కడ నాకు గౌరవం లేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గం మీదగాని..నా మీదగాని వారికి ప్రేమలేదన్నారు. గ్రూప్ రాజకీయాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారన్నారు.
కొమురం భీమ్ జిల్లా కౌటల మండలకేంద్రంలో అనుచరులతో భేటీలో మాట్లాడిన కోనప్ప కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. కౌటల బ్రిడ్జీ నిర్మాణం చేయాలని కోరినా సీఎం రేవంత్ స్పందించలేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పనులను కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు.
కౌటాల బ్రిడ్జిని ప్రభుత్వం రద్దు చేసిందని..11 సార్లు రోడ్లు మంజూరైనా తర్వాత కూడా రద్దు చేశారని..రోడ్ల రద్దుపై మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా కానీ..ఇపుడు రైతులను పట్టించుకునే వారే లేరన్నారు. ఈ నెల 25న చింతమానేపల్లిలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలో అన్ని విషయాలు చర్చించుకుందామని..అందరూ రావాలని కోరారు.