హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో వర్షాలకు గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు ఆరుగురిని అరెస్టు చేశారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో వర్షాలకు గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు ఆరుగురిని అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని గురువారం కోర్టులో హాజరు పరిచారు. ఈ ఘటనలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలకు శవపరీక్ష పూర్తి చేసిన అనంతరం వారి బందువులకు అప్పగించారు.
బాచుపల్లి కౌసల్య కాలనీలో ఐదంతస్తుల భవనాన్ని రైజ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఇక్కడ గతంలో 10-15 అడుగుల ఎత్తు వరకు ప్రహరీని నిర్మించారు. తరువాత దానినే 30-40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దానిని ఆనుకొని ఉన్న రేకులషెడ్డుపై పడింది. అందులో నివసిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురు గాయపడ్డారు.