విధాత, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అనవసరమంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. దివ్యాంగులపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపారు. వైకల్యం పేరుతో వారి హక్కులను హరించడం సరైంది కాదన్నారు. ‘దివ్యాంగులు కొన్ని ఉద్యోగాలకు పనికిరారని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వాళ్లు సకాలంగుల కంటే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. చట్టాలను అమలు చేయాల్సిన ఏఐఎస్ అధికారిణి వైకల్యాన్ని కించపర్చడం సమంజసం కాదన్నారు. స్మితా సబర్వాల్.. తను చేసిన వ్యాఖ్యలను వెనక్కితీసుకోకపోగా.. సమర్ధించుకోవడం శోచనీయమని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోదండరాం సూచించారు.