విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఉల్లంఘనకు పాల్పడే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన సందర్భంగా సోమవారం ఆయన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
రాజకీయ నాయకులు, శాసనసభ్యులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో, మత సంబంధమైన ప్రదేశాల్లో ఎన్నకల ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోపు తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికలుముగిసే వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యంత్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, మూడు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రచార కార్యక్రమాలను రికార్డింగ్ చేయాలని సూచించారు. అక్రమ డబ్బు చెలామణి, మద్యం సరఫరా వంటివి జరుగుతున్నాయో గుర్తించి అక్కడకు ఈ టీంలను పంపించి వీడియో చిత్రీకరించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదుకు సీ విజిల్ యాప్తో పాటు కంట్రోల్ రూం నంబర్ 1950 ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా సరిహద్దులో 5 చెక్ పోస్టులు: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియామవళిని నిష్పక్షపాతంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా సరిహద్దుల్లో 5 చెక్ పోస్టులను ఏర్పాటు పటిష్ట నిఘా పెట్టాలన్నారు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.