గ్యారెంటీలంటూ గారడీ మాటలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. త్వరలోనే ఆ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు
కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
చెప్పిన హామీలు ఏమయ్యాయి
ఇంటింటి ప్రచారంలో సునీత జగదీష్ రెడ్డి
విధాత: గ్యారెంటీలంటూ గారడీ మాటలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. త్వరలోనే ఆ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు. బీఆరెస్ నల్లగొండ లోక్సభ స్థానం బీఆరెస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి కి మద్దతుగా సునీత జగదీష్ రెడ్డి సూర్యాపేటలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యంకానీ హామీలను గుప్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆరెస్ పాలన లో ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, త్రాగునీరు వంటి సంక్షేమ పథకాలు సజావుగా అందాయని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఐదు నెలలుగా ఎటువంటి పథకాలు అందక ,ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కేసీఆర్ తెచ్చిన పథకాలను కూడా కొనసాగించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. కేసిఆర్ ఇచ్చిన నీళ్ళు బంద్ అయ్యాయని,కరెంటు బంద్ అయిందని, కల్యాణ లక్ష్మి లేదు , రైతు బందు లేదన్నారు. బీఆరెస్ పాలనలో పట్టణ ప్రగతితో సూర్యాపేట సహా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి రూపురేఖలే మారిపోయాయన్నారు. గత పాలనను, ప్రస్తుత పాలనను బేరీజు వేసుకొని ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి బీఆరెస్ను గెలిపించాలని కోరారు.