Tresa । ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తమను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వివిధ జిల్లాల నుండి వచ్చిన సుమారు 150 మంది తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు నాంపల్లిలోని ట్రెసా కేంద్ర కార్యాలయానికి చేరుకొని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చారు. తిరుగు బదిలీలు లేక కుటుంబాలకు దూరంగా ఉండి విధులు నిర్వహిస్తున్నామని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేసారు. వారిని సముదాయించి, వారితో సుదీర్ఘంగా చర్చించిన ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ తదితరులు అనంతరం వారందరిని రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. వారితో మాట్లాడిన మంత్రి వివిధ కేడర్ల బదిలీలు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ల/ రికార్డు అసిస్టెంట్ల బదిలీలపై సానుకూలంగా స్పందించి త్వరలో బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు ఉపాధ్యక్షులు కె. నిరంజన్, బాణాల రాంరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు చంద్రశేఖర్, మధుకర్, నిర్మల్ అధ్యక్షులు వెంకట రమణ,వివిధ జిల్లాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.
Tresa । తహసీల్దార్ల ఎన్నికల బదిలీలు చేపట్టాలని పొంగులేటికి ట్రెసా ప్రతినిధి బృందం విజ్ఞప్తి
