బాయిల్డ్ రైస్ తీసుకోండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల వినతి

తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో కోరారు.

బాయిల్డ్ రైస్ తీసుకోండి: కేంద్ర మంత్రికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల వినతి

ఢిల్లీ : యాసంగి పంట‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌రించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట‌ బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. గత ఆరు యాసంగి సీజ‌న్ల‌లో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని గుర్తు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయ‌న నివాసంలో సీఎం, రాష్ట్ర మంత్రి శుక్రవారం ఉద‌యం క‌లిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఇటీవ‌ల కేంద్ర‌ ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.

5 శాతం నూక‌తో బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాకు సిద్ధం

తెలంగాణ‌లో ఈ యాసంగి సీజ‌న్‌లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ తెలియ‌జేశారు. తెలంగాణ‌లో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఈ నేపథ్యంలో యాసంగి పంట‌కు సంబంధించిమొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూక‌తో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూక‌తో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి ముఖ్య‌మంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపారు.

పాత బ‌కాయిలు రూ.1,468.96 కోట్లు విడుద‌ల చేయండి

2014-15 వ‌ర్షాకాలం పంట అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వ‌రి ధాన్యం ఉత్పత్తి, సేక‌ర‌ణ‌లో తెలంగాణ అగ్రగామిగా ఉంద‌ని, ధాన్యం సేక‌రించిన 48 గంట‌ల్లోనే రైతుల‌కు తాము చెల్లింపులు చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి తెలియ‌జేశారు. రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంట‌నే పాత బ‌కాయిలు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

పోష‌కాహార బియ్యం పంపిణీని పునఃప్రారంభించండి

పిల్లల్లో ర‌క్తహీన‌త‌, పోష‌కాల లోపాల‌ నివార‌ణ‌కు గానూ పోష‌కాహార బియ్యాన్ని (FRK) పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, ఐసీడీఎస్‌ల ప‌రిధిలో పంపిణీ చేసేవార‌ని… ఇటీవ‌ల దానిని నిలిపివేసినందున వెంట‌నే దానిని పునః ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స‌మావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, సెక్రట‌రీ కోఆర్డినేష‌న్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మూసీ సుందరీకరణకు కార్తీక్ రెడ్డి ఎన్‌జీటీ పిటిషన్ బ్రేక్ లు !
బైక్ తో రైలును లాగేందుకు యత్నం..వైరల్ గా వీడియో