Congress | కేటీఆర్ ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్‌

సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన బలిదేవత ఎవరని...బలిదానాలకు బాధ్యులేవరని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సైతం అంతే ధీటుగా ట్విటర్ వేదికగా ప్రశ్నాస్త్రాలతో కౌంటర్ ఎటాక్ చేసింది.

  • Publish Date - May 31, 2024 / 04:41 PM IST

ఉద్యమం మాటున మోసాలు చేసిందేవరంటూ ప్రశ్నాస్త్రాలు
హామీల ఉల్లంఘనలు చేసిందేవరంటూ మండిపాటు
దోచుకున్న తెలంగాణ సొమ్మును కక్కిస్తామని హెచ్చరిక

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన బలిదేవత ఎవరని…బలిదానాలకు బాధ్యులేవరని ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ పార్టీ సైతం అంతే ధీటుగా ట్విటర్ వేదికగా ప్రశ్నాస్త్రాలతో కౌంటర్ ఎటాక్ చేసింది. తెలంగాణ ఉద్యమం మాటున మోసాలు చేసిందెవరంటూ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులపై విమర్శలు గుప్పిస్తూ కేటీఆర్ ట్విట్ తరహాలోనే ప్రశ్నలు సంధించింది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చెప్పిన గత ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం సభ్యులు ఎవరని కాంగ్రెస్ ప్రశ్నించింది.

ట్విట్‌లో సోనియాగాంధీతో కేసీఆర్ కుటుంబం దిగిన ఫోటోను జత చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష డ్రామా చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లమీదకు వస్తే పెట్రోల్ బాటిల్ పట్టుకుని అగ్గిపుల్ల గీయకుండా డ్రామా చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ పోరాటం చేస్తుంటే దీక్ష విరమణ చేసి హాస్పిటల్ లో జ్యూస్ తాగింది ఎవరని కాంగ్రెస్ తన ట్విట్‌లో నిలదీసింది. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన తొలి అమరుడు శ్రీకాంత్ చారి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయిన సభ్యుల వివరాలు లేవని కొంతమంది వివరాలు మాత్రమే ఉన్నాయని చెప్పింది ఎవరు?.

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఎంతోమంది ఉండగా ఒకే కుటుంబంలో 5 మందికి పదవులు ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసింది ‌ఎవరు‌? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రైతులకు భేడీలు వేసి జైలుకు పంపింది ఎవరంటూ ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసింది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే దళితుడు తొలి ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసింది ఎవరని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా 10 ఏళ్ళు మోసం చేసింది ఎవరు? అధికారంలోకి వస్తే దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 10 ఏళ్లు మోసం చేసింది ఎవరని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో మీరు దోచుకున్న భూములను, దోపిడీ సొమ్మును అన్నీ లెక్కలతో సహా కక్కిస్తామని, మిస్టర్ కేటీఆర్ నువ్వు నీ తండ్రి 2014, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలను మోసం వేసిన తీరు ఒకసారి గుర్తు చేసుకో…తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన నీకు బుద్ది రాకపోతే ఎలా!? అని మండిపడ్డారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మేము ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం మా లక్ష్యం సుభిక్షమైన తెలంగాణ అని ట్విట్‌లో పేర్కోన్నారు.

Latest News