తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నూతనంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్(ఎన్ఈహెచ్ఎస్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించిన ఎన్ఈహెచ్ఎస్ పోర్టల్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతలకు కొత్త హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా తొలి హెల్త్ కార్డులను టీఎన్జీవో అధ్యక్షుడు జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావులకు అందించారు.
ఈ కొత్త విధానం ద్వారా మరింత పారదర్శకంగా నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చని మంత్రులు భట్టి, దామోదరలు స్పష్టం చేశారు.ఈ పథకంలో ఉద్యోగుల నుంచి ప్రతి నెలా మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. వైద్య చికిత్సలకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) రేట్లను వర్తింపజేస్తారు.
