తెలంగాణ ఉద్యోగుల బకాయిలు రూ.1000కోట్లు విడుదల!

తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం రూ.1000 కోట్లు విడుదల చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిల క్లియరెన్స్‌కు ఊరట లభించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల నిధులు రూ.1000కోట్లు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం నిధులు విడుదల చేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లో ఇచ్చిన హామీ నెరవేర్చినట్లయ్యింది. తాజా ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిల నెలవారి చెల్లింపు నిధులు ​నెలకు రూ.700 కోట్ల నుండి రూ. 1000కోట్లకు పెరిగాయి. ఆక్టోబర్‌ 2025 వరకు రిటైర్డ్‌ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియర్‌ చేసింది.

గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను పరిగణలోకి తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.1000 కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు.

​పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల GPF (General Provident Fund) బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం.

ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ​మెడికల్ బిల్లులు, స్కాలర్‌షిప్‌లకూ మోక్షం ​ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల కష్టాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది అని అధికారులు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం: చంద్రబాబు
బీజేపీ వివక్షతతోనే తెలంగాణలో ఇంధన సమస్యలు : మంత్రి పొంగులేటి

Latest News