Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణపై చర్చించి తెలపాలని ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విధాత, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు 2వారాలకు వాయిదా వేసింది. ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోరుతూ ఎన్నికల కమిషన్ రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటీషన్ విచారించిన హైకోర్టు..నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది తెలిపారు. నిన్న ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరుతూ లేఖ రాసిందని పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల కమిషన్ గత నోటిఫికేషన్ ఇచ్చిందని..రిజర్వేషన్లపై హైకోర్టు స్టే నేపథ్యంతో పాటు పాత 50శాతం రిజర్వేషన్ అనుసరించి స్థానిక ఎన్నికలు పెట్టుకోవచ్చని ఉత్తర్వులలో పేర్కొనడంతో…ఎన్నికల కమిషన్ గత నోటిఫికేషన్ సస్పెండ్ చేసిందని వివరించారు. తాజాగా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుందన్నారు. ఇందుకు రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ..తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.