కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లయినా బీఆరెస్ అసమర్ధ, అవినీతి, కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆరెస్ తరహాలోనే పాలన సాగిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ విమర్శించారు
విధాత, , హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లయినా బీఆరెస్ అసమర్ధ, అవినీతి, కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆరెస్ తరహాలోనే పాలన సాగిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపి పోరాటం చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర బిల్లుకు మద్దతు ఇస్తామని అప్పట్లో రాజ్భాథ్ సింగ్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కోసం గళమెత్తారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చరిత్రను వక్రీకరిస్తున్నారని, 1200 మంది బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సోనియాగాంధీ ఇస్తేనే వచ్చినట్లుగా చెబుతున్నారన్నారు. ఉద్యమ సమయంలో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని, సీఎం అయ్యాక బలిదేవతను ఎలా ఆరాధిస్తున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పడం సరి కాదన్నారు. సకల జనులు పోరాటం చేసి సాధించుకున్నారన్నారు. తెలంగాణ సాధనకు ఉద్యమించిన బీజేపీని, సుష్మాస్వరాజ్ను రేవంత్ ప్రభుత్వం విస్మరించడాన్ని ప్రజలు క్షమించరన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయకపోవడం వల్లే కేసీఆర్ను గద్దె దించారని, కేసీఆర్ ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను విస్మరించిందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి రాజకీయ వివాదాలు సృష్టిం కాలం వెళ్లదీస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఆ పార్టీ పెద్దలకు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. 6 గ్యారంటీలు సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని తెలిపారు. ఏ వర్గం ప్రజలను కదిలించినా అశాంతి, అగ్రహమే కనిపిస్తోందని చెప్పారు. ఉద్యమ ఆకాంక్షల అమలుకు బీజేపీ పోరాడుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే నీ భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందని ఐదేళ్లు ఆయనకు కష్టమేనని లక్ష్మణ్ హెచ్చరించారు.