లక్షలోపు రుణాల రైతుల సంఖ్య 39లక్షల మందికన్నా ఎక్కువే..ప్రభుత్వానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్న
రాష్ట్రంలో 1 లక్షలోపు రుణం తీసుకున్న రైతులు మా ప్రభుత్వంలో 39 లక్షల మంది రైతులు ఉంటే, ఆ సంఖ్య ఇప్పటికీ పెరిగి 45 లక్షలు అయిందని, కానీ ఈ ప్రభుత్వం మొదటి, రెండు విడతల్లో కలిపి కేవలం 16 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందని మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటి..?

16లక్షల మందికే మాఫీ..మిగతా వారి పరిస్థితి ఏంటీ?
విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో 1 లక్షలోపు రుణం తీసుకున్న రైతులు మా ప్రభుత్వంలో 39 లక్షల మంది రైతులు ఉంటే, ఆ సంఖ్య ఇప్పటికీ పెరిగి 45 లక్షలు అయిందని, కానీ ఈ ప్రభుత్వం మొదటి, రెండు విడతల్లో కలిపి కేవలం 16 లక్షల మంది రైతులకే రుణమాఫీ చేసిందని మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటి..? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు. సోమవారం తెలంగాల భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందేమో రైతు రుణాలు రూ. 40 వేల కోట్లు అని చెప్పి, చివరకు పత్రికా ప్రకటనల్లో రూ. 31 వేల కోట్లుగా చూపారని, జులై నెలలో తొలి విడతగా లక్షలోపు కేవలం 6 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతుబంధు ఖాతాలు 69 లక్షల పైచిలుకు ఉంటే రుణాల తీసుకున్న సంఖ్య 60 లక్షల పైచిలుకు ఉందన్నారు. మరి ఈ 60 లక్షల పైచిలుకు రుణాలు పొంది ఉన్న రైతుల్లో 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉందని, తొంభై రెండున్న శాతం భూమి 5 ఎకరాల్లోపు ఉన్న రైతుల చేతుల్లో ఉందని, అటువంటప్పుడు లక్ష లోపు రుణం కలిగిన ఉన్న రైతుల సంఖ్య 39 లక్షలు ఉంటే.. ఇప్పుడు అది 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాలన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడుతలో 11 లక్షలు, రెండో విడుతలో 5 లక్షల మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేసిందని, మరి మిగతా రైతులు ఎటు పోయారని ప్రశ్నించారు. రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్యను జిల్లాలవారీగా ఎందుకు ఇవ్వడం లేదని, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని మొదటి, రెండో విడుత కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు రూ. 12 వేల కోట్ల చిల్లర మాత్రమేనని, మీరు చేసిన ఘనకార్యం ఏందని నిరంజన్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులకు బీఆరెస్ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని, లక్ష కానీ, లక్షన్నరలోపు కానీ బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ 8374852619 వాట్సప్ నంబర్కి మీ వివరాలు పంపాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. మా తెలంగాణ భవన్లో ఇద్దరు అధికారులను ఈ సమస్య మీదనే నియమించాం అని ఆయన తెలిపారు.ఏ సర్వే నంబర్ మీద రుణం పొందారు.. ఏ గ్రామం, ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు అనే వివరాలతో ఇతర విషయాలను వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాలతో మీ రిమార్క్స్ కూడా రాయండని, రుణమాఫీ ఎందుకు కాలేదు.. అధికారులు ఏమన్నారు..? వంటి డిటెయిల్స్ రాసి పంపించండి అని నిరంజన్ రెడ్డి కోరారు.