ఓ వైపు గెలుపు పై ధీమా.. మరో వైపు ఓటమి భయం... పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది.అంతా మంచిగానే .. కానీ మరో వైపు అనుమానం... మూడు పార్టీ ల అభ్యర్థులు సంకట స్థితి మధ్య కొట్టు మిట్టడుతున్నారు.
ఓ వైపు గెలుపుపై ధీమా.. మరోవైపు ఓటమి భయం
నియోజకవర్గాలవారీగా బేరీజు వేసుకుంటున్న అభ్యర్థులు
పాలమూరులో హోరాహోరీగా మూడు పార్టీల ప్రచారం
పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో త్రిముఖ పోరు!
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఓ వైపు గెలుపు పై ధీమా.. మరో వైపు ఓటమి భయం… పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. అంతా మంచిగానే ఉందనే నమ్మకం.. కానీ.. మరో వైపు అనుమానం.. ఈ సంకటస్థితి మధ్య మూడు పార్టీల అభ్యర్థులు కొట్టు మిట్టడుతున్నారు. నియోజకవర్గాలవారీగా ఇప్పటి నుంచే ఓట్లను బేరీజు వేసుకొంటూ ప్రచారంలో ఎవరికి వారు దూసుకెళుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ముందుగా కాస్త వెనుకబడిన గులాబీ పార్టీకి కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా కొంత ఊపు వచ్చింది. కేసీఆర్ రాకతో ఆ పార్టీ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్ వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నాయకులు, కార్యకర్తల మద్దతుతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకు అరుణకు మద్దతుగా బీజేపీ అగ్రనేతలు ఈ నియోజకవర్గంవైపు కన్నెత్తి చూడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో గెలుస్తామనే ఆలోచనలో డీకే అరుణ ఉన్నారు.
మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఒక్క నియోజకవర్గంలో కూడా బీజేపీకి ఎమ్మెల్యేలు లేకపోవడంతో నాయకులతో కలిసి ప్రచారంలో ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ వైపు వారిని మళ్ళించే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ఉధృతంగా ప్రచారం చేస్తూ తన గెలుపుపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి మద్దతుగా మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, షాద్ నగర్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆరుసార్లు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ అభ్యర్థి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు చేరకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అని వంశీ లోలోపల ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఈ స్థానం గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండడంతో కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడి ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. గెలుస్తామనే ధోరణి ఒక వైపు, ఓటమిపై మరో వైపు ఆందోళనలో కాంగ్రెస్ అభ్యర్థి కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీలో ఎవరికి వారు గెలుస్తామనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు.
నాగర్ కర్నూల్లో హోరాహోరీ
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అనే విధంగా ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, విజయుడు మద్దతుగా నిలిచి ప్రవీణ్ కుమార్ గెలుపునకు బాటలు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మద్దతు కోరారు. ఈ యాత్ర ద్వారా బీఆర్ఎస్కు కొంత గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం చేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. వీరిద్దరి ప్రచారంతో గులాబీ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో ఆ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తన గెలుపు పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నుంచి గట్టి పోటీ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. బహుజనవాదంతో ప్రచారంలో ముందుకు వెళుతున్న ప్రవీణ్ కుమార్ ఎంత వరకు వారి ఓట్లు తమ వైపునకు తిప్పుకుంటారో వేచిచూడాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేపట్టి మల్లు రవిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే విషయం ప్రజలకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కలిసి వస్తుందనే ధోరణిలో మల్లు రవి ఉన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ కొంత పుంజుకుందనే ధోరణిలో ఉన్న మల్లు రవి కొంత ఆందోళనలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండా రెడ్డి పల్లి ఉండడం, ఇక్కడ కూడా గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇప్పటికే మల్లు రవికి మద్దతుగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అగ్ర నేత ప్రచారంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలం చేకూరిందనే ఉద్దేశంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.
బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ తన తండ్రి ఎంపీ రాములు సహకారంతో ప్రచారం లో ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన భరత్కు ఆ రెండు పార్టీల శ్రేణులు మద్దతుగా ఉంటారనే ఆశతో ఉన్నారు. దీంతో పాటు ప్రధాని మోదీని ఉపయోగించుకుని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ గాలి బాగా ఉందని, తన గెలుపు తథ్యమనే భావనలో భరత్ ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేరు.
అయినా మోదీ పేరుతో గెలుస్తామనే ధీమాలో భరత్ ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నాగర్ కర్నూల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మళ్ళీ బీజేపీ రాష్ట్ర అగ్ర నేతలు కానీ, జాతీయ నేతలు కానీ ఎవ్వరూ ప్రచారం లో పాల్గొనక పోవడంతో భరత్ తన గెలుపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోదీ చరిష్మాతో గెలుస్తాననే ధోరణిలో ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీలో గెలుపెవరిదోనని ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.