ప్రగతిభవన్, సచివాలయం భూములు అమ్మైనా దళితబంధు అమలు చేయాలి
విధాత: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా భవన్లో టీపీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా జరిగిన సమావేశంలో రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడారు.దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. […]

విధాత: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా భవన్లో టీపీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా జరిగిన సమావేశంలో రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడారు.
దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ.. పోడు భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ.. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై ప్రేమ ఉండి కాదని.. కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారని ఆయన ఆక్షేపించారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో లక్షమందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి ‘ఇస్తావా..చస్తావా’ అనే నినాదంతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దళిత బంధు అమలు చేయకపోతే తెరాస ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు.