ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలని, పీఎంజీఎస్వై పనులకు తెలంగాణకు మరిన్ని అనుమతులు, నిధులు ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దక్షిణాది రాష్ట్రాల పీఎంజీఎస్ వై(PMGSY) ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని..రాష్ట్ర సమస్యలు, అవసరాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గత 25 ఏళ్లుగా పీఎంజీఎస్ వై పథకం గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు రాకపోకలను మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం మారుమూల గ్రామాలు, ఆదివాసి గిరిజన గూడెలను, మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది అని తెలిపారు. అయితే గతంలో ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకానికి 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని, కానీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తోందని, ఆ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు.రాష్ట్రాలపై 40 శాతం భారం వేయకుండా, గతంలో మాదిరిగా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు.
ఆర్థికంగా వెనుకబడిన, భౌగోళికంగా క్లిష్టమైన ప్రాంతాల రాష్ట్రాలకు ప్రత్యేక సడలింపులు అవసరమని తెలిపారు. ముఖ్యంగా ఆదివాసి గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారి అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీతక్క విజ్ఞప్తి చేశారు.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వంటి ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధి, గ్రామీణ రవాణా సౌకర్యాల దృష్ట్యా అటవీ, వన్యప్రాణి నిబంధనల్లో అనుకూల మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు.
ఇప్పటికే ఉన్న పాత రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం, అప్గ్రేడేషన్ పనులకు కూడా అటవీ నిబంధనలు అద్దంకిగా మారాయని, ఆయా పనులకు సులభంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంరక్షణ చట్టాల్లో ఈ మధ్య తెచ్చిన మార్పులు ఆదివాసీల అభివృద్ధికి అటంకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ రహదారుల నిర్వహణ కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ను రాష్ట్రం అమలు చేస్తోందన్నారు.
పీఎంజీఎస్ వై-4 కింద తెలంగాణలో ఇంకా అనేక ప్రాంతాలకు రోడ్డు అనుసంధానం అవసరమని, మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, అభివృద్ధి కేంద్రాలకు గ్రామీణ ప్రజలు సులభంగా చేరుకునేలా మరిన్ని పనులు మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను కోరారు.
మంత్రి చేసిన విజ్ఞప్తులపై కేంద్ర ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలు, అభిప్రాయాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రెటరీ అతిథి సింగ్ తెలిపారు. అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర స్థాయిలో చర్చించి, పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక అనుమతుల మంజూరు అంశాన్ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు
ఈ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్, ఎన్ఆర్ఐడీఏ డైరెక్టర్ జనరల్, దక్షిణాది రాష్ట్రాల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
ధాన్యం కొనుగోలు సమస్యలపై కవిత సచివాలయం ముట్టడి
దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్ : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
