తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫలితాల విడుదలలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్ కలిసి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10న మూల్యాంకన చేపట్టగా, ఏప్రిల్ 10వ తేదీన ముగిసింది. మూల్యాంకనం పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. గతేడాది మే 9న ఇంటర్ ఫలితాలు ప్రకటించగా, ఈ ఏడాది 15 రోజుల ముందే ఫలితాలను విడుదల చేస్తున్నారు.