నిన్నటి వరకు ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు... ఒకరు ముఖ్యమంత్రి అయితే, మరొకరు ఉప ముఖ్యమంత్రి. ఈ మధ్యకాలంలో వీరిద్దరి స్థానాలు మారిపోయాయి
విధాత ప్రత్యేక ప్రతినిధి: నిన్నటి వరకు ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకులు… ఒకరు ముఖ్యమంత్రి అయితే, మరొకరు ఉప ముఖ్యమంత్రి. ఈ మధ్యకాలంలో వీరిద్దరి స్థానాలు మారిపోయాయి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరిపోయారు. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినప్పటికీ, ఆ పార్టీని కాలదన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవడానికి బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే పార్టీని కడియం శ్రీహరి వీడడం పట్ల ఆ పార్టీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కడియం శ్రీహరి అంటే తొలి నుంచి గిట్టని నాయకులు మరికొంత స్వరంపెంచి తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని కడియం శ్రీహరి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీహరి కుమార్తె కావ్యను ఓడించాలని లక్ష్యంతో బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే శ్రీహరిని నిన్నటి వరకు బీఆర్ఎస్ నేతలంతా తిట్టిపోశారు. ప్రస్తుతం ఈ జాబితాలో కెసిఆర్ కూడా చేరిపోయారు. దీనిపై అదే స్థాయిలో కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి కెసిఆర్ పై కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పూ అనే స్థితికి రాజకీయ విమర్శలు చేరాయి. వరంగల్ కేంద్రంగా పరస్పరం ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదివారం హనుమకొండలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రోడ్డు షోలో కేసీఆర్ కడియం పై తీవ్ర విమర్శలు చేశారు.
ఇక్కడ ఒక మనిషికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ తాను పార్టీ మారారని కెసిఆర్ ఎద్దేవా చేశారు. మారిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు ఆయనే కడియం శ్రీహరి అంటూ గుర్తు చేశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందంటూ ప్రశ్నించారు. అలాంటివారు అధికారం మా రగాలి మళ్ళీ కాంగ్రెస్లో చేరడం మీరే ఆలోచించాలంటూ ప్రజలకు విన్నవించారు. మరో మూడు నెలల్లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్టేషను ఘన్ పూర్ లో ఉప ఎన్నిక వస్తుందని,అప్పడు రాజయ్యే ఎమ్మెల్యే అవుతాడని జోష్యం కూడా చెప్పారు. కడియం శ్రీహరి పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. కడియం శ్రీహరి మోసగాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు అయితే కడియం పై ఒంటికాలితో లేస్తున్నారు. నిన్న కేసీఆర్ రోడ్ షోలో కడియం శ్రీహరిని టార్గెట్ చేసి మాట్లాడాడు.
– కెసిఆర్ పై కడియం ఘాటు స్పందన
కెసిఆర్ విమర్శలకు కడియం శ్రీహరి సోమవారం ప్రతిస్పందించారు. తనను మోసగాడు అంటున్న కేసీఆర్ వరంగల్ ప్రజలను తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పని చేసిన ప్రతి ఒక్కరిపై భూకబ్జాల కేసులున్నాయి.అవినీతి కేసులు ఉన్నాయి.ఫోన్ టాపింగ్ కేసులు ఉన్నాయని వేలెత్తి చూపారు. వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేసింది కేసీఆర్ అంటూ కాకతీయులిచ్చిన వారసత్వాన్ని ముక్కలు ముక్కలు చేశావని మండిపడ్డారు. ఒకప్పుడు ఓరుగల్లు అని చెప్పుకునే వాళ్ళమని, ఇప్పుడు ఎవరు ఏ జిల్లాలో ఉన్నారో చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆగం చేసింది కెసిఆర్ అంటూ విమర్శించారు. మూడు నెలల్లో ఏదో అద్భుతం జరుగుతుందని కేసీఆర్ అంటున్నాడుగానీ పార్లమెంటే ఎన్నికల తర్వాత ఒక్క సీటు కూడా గెలవకుండా కేసీఆర్ పార్టీ మూతపడబోతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి మధ్య పోటీ ఉంటదన్నారు. బిఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని అన్నారు. కెసిఆర్ నాపై విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే పని చేయాలని హితోపదేశం చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత మీద కరెక్ట్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి జైల్లో పెట్టారని, మహిళల్లో అన్ని రంగాల్లో ముందుండాలి కానీ లిక్కర్లాంటి దుష్ప్రభాలకు దూరంగా ఉండాలన్నారు. కెసిఆర్ కుమార్తె కవిత వల్ల కేజ్రీవాల్ ఆగమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు శత్రువైన రాజయ్య లాంటి వాడికి ఇస్తేనే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బతికేదన్నారు. బిజెపిని గెలిపించేందుకే డమ్మీ అభ్యర్థిని నిలపెట్టాడు కేసీఆర్ అంటూ విమర్శించారు. వరంగల్ అంటే కెసిఆర్ కు కోపం, వ్యతిరేకత అంటూ ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని భయమని కడియం అన్నారు. ప్రెస్మీట్లో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కడియం కావ్య, తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.