ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క

ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లే ఆర్థిక సమస్యలు తలెత్తాయని..ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు

ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క

హైదరాబాద్, ఆగస్ట్ 24 (విధాత): ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్లే ఆర్థిక సమస్యలు తలెత్తాయని..ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్‌లో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాడుగుల పర్వత్ రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. పర్వత్ రెడ్డి దంపతులను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పర్వత్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ ఉద్యమకారుడిగా కూడా పేరుపొందారని, ఆయన జీవితం ఉపాధ్యాయులందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలి ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడిన ఎస్టీయూ ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కృషి చేసిందని, ఎందరో మహనీయులు ఈ సంఘం ద్వారా సమాజానికి సేవలందించారని గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఈ సంఘ సదస్సులకు హాజరయ్యారని తెలిపారు. ఎన్నో కష్టాలు ఎదురైనా ఉపాధ్యాయులు..విద్యా సమస్యలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని ఆమె అన్నారు.

ఉపాధ్యాయ వృత్తి కంటే గొప్ప వృత్తి మరొకటి లేదని, భారతదేశ భవిష్యత్తును నిర్మించే పవిత్ర వృత్తి ఇదేనని సీతక్క పేర్కొన్నారు. పర్వత్ రెడ్డి విద్య బోధనలో ఎప్పుడూ రాజీ పడలేదని, విలువలతో కూడిన విద్యనే అందించారని తెలిపారు. ఆయన పదవీ విరమణ అనేది కేవలం ఉద్యోగానికి మాత్రమేనని, సమాజ సేవలో మాత్రం కొనసాగుతారని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సీఎం ఇప్పటికే సంఘాలతో సమావేశం అయ్యారని సీతక్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల విధానాల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తాయని, అందువల్ల కొంత ఆలస్యం జరుగుతున్నా సమస్యలను పరిష్కరించడానికి కృషి జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందలేదని, బదిలీలు పదోన్నతులు లేక ఉపాధ్యాయులు నష్టపోయారని, ఆ నష్టాన్ని పూరించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మికులు కర్షకులు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రజా ప్రభుత్వం ఆయా వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.