సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు
4,500కోట్లతో జీవనోపాధుల కల్పన
సభ్యులకు రూ. 10 లక్షల ప్రమాద భీమా
రూ. 2 లక్షల రుణ బీమా
మంత్రి సీతక్క
విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయ వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఐదు సంవత్సరాల రుణ లక్ష్యాలను నిర్ధేశించుకుంది. ఏటా 20వేల చొప్పున ఈ రుణ ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అలాగే మహిళలకు రూ.10లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల రుణ బీమా కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 4,500కోట్లతో జీవనోపాధుల కల్పనకు ఆర్థిక సహాయం అందించబోతున్నట్లుగా తెలిపారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25ను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్షిక ఋణ ప్రణాళికతో రూ. 20,000.39 కోట్లను 3,56, 273 సంఘాలకు ఋణ పంపిణీ లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో బ్యాంక్ ల ద్వారా మహిళా శక్తి పథకం క్రింద లక్ష కోట్ల ఋణాలు వివిధ ఆర్థిక కార్యక్రమాల కొరకు మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యాన్ని నిర్థారించుకోవటం జరిగిందన్నారు. బ్యాంక్ వారు ఈ ఆర్థిక సంవత్సరం ఎస్హెచ్జీ రుణాల మంజూరీలో పెట్టుకున్న లక్ష్యాన్ని గత సంవత్సరం మాదిరిగా అధిగమిస్తారని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళ సంఘాలకు వడ్డీలేని ఋణాల క్రింద 2,53,864.సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబర్ 2023 నుండి మార్చి, 2024 వరకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేయడము జరిగిందని తెలిపారు. మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయంతో అభివృద్ది సాధించి, ఆర్థికంగా ఎదగాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యొక్క స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని, తద్వారా రాష్ట్రంలోని సంఘాల మహిళలకు రూ. 50 కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
అన్ని చోట్ల మహిళా శక్తి క్యాంటీన్లు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడ తీసుకోవడం జరిగిందని సీతక్క తెలిపారు. సెక్రటేరియట్, కలెక్టర్ కార్యాలయాలలో, అన్ని ప్రధాన కార్యాలయాలలో, పర్యాటక ప్రాంతాలలో, దేవాలయాలు, బస్టాండ్లలో, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని రాబోయె కాలంలో క్యాంటిన్ల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయడము జరిగిందన్నారు. ఆయా ఉపాధి కార్యక్రమాల ద్వారా మహిళా సంఘాలలోని మహిళలకు ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. వారు చేసే ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి చేసుకుందుకు వ్యక్తిగత రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించడము జరుగుతుందని, మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.
4,500కోట్లతో జీవనోపాధుల కల్పన
మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 3,56,273 సంఘాలకు ఇచ్చే రూ. 20,000 కోట్లకు అదనంగా 2,25, 000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాలకు రూ. 4,500 కోట్లు బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని వెల్లడించారు. గ్రామీణ మహిళలకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమలో మరియు ఇతర వృత్తులలో తగిన శిక్షణ కల్పించి మెరుగైన జీవనోపాధులు పొందడానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందని సీతక్క పేర్కోన్నారు. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా రుణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, మా ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని, ప్రతి కుటుంబానికి రూ. 500 లకే సిలిండర్, 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందించడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు రూ. 5 లక్షలు, మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి నెల రూ. 2,500/ సహాయ పథకాలను త్వరలో ప్రారభిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డు సీజీఎం సుశీల చింతల, సెర్ఫ్, డీఆర్డీవో అధికారులు, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ జిల్లాల మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.