• Telugu News
  • /Telangana

Work Fair 25 | తెలంగాణలో పనుల జాతర!.. రూ.2198.83 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభాలు

రాష్ట్రవ్యాప్తంగా పనుల జాతర – 25 పేరుతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించింది. ఉద్యమరూపంలో అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం సందడి నెలకొంది. జిల్లాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈ పనుల జాతరలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది.

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Aug 22, 2025, 8:31 pm IST
Read Time: 7 mins
Work Fair 25 | తెలంగాణలో పనుల జాతర!.. రూ.2198.83 కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభాలు

విధాత ప్రత్యేక ప్రతినిధి:

Work Fair 25 | త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు (local elections) నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సమయంలో సమస్యల విషయంలో గ్రామీణ ప్రాంత ప్రజల (village people) నుంచి వ్యతిరేకత రాకుండా వసతుల (infrastructure) రూపకల్పనతోపాటు, అభివృద్ధి పనులు (developmental works) చేపట్టేందుకు ఈ పనుల జాతర (panula jathara) కార్యక్రమాన్ని రూపొందించినట్లు భావిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ (panchayat raj department) ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలన్నింటినీ ఒకే దఫాలో చేయడం వల్ల గ్రామాల్లో చర్చకు అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వంపై వ్యతిరేకత (anti government) ఉంటే తగ్గించేందుకు ఉపకరిస్తుందనే అభిప్రాయం అధికార పార్టీలో వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏది ఆశించి చేపట్టినప్పటికీ తమ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు నాంది పలికారని స్థానికులు (local people) సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రూ.2198.83 కోట్లు…1,01,589 పనులు

రాష్ట్రవ్యాప్తంగా 10,1589 పనులను ఈ పనుల జాతర సందర్భంగా చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ లక్ష్యంగా ఎంచుకున్నది. దీనికి రూ.2198.83 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు, పశువుల కొట్టాలు, కోళ్ళు, గొర్లు, మేకల షెడ్లు, బావుల తవ్వకం, ఫారం పాండ్స్‌, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వ్యవసాయ పొలాలకు మట్టిరోడ్లు, ప్రభుత్వభవనాలలో వర్షం నీటిసేకరణ పిట్లు, నీటి నిల్వ కుంటలు, ఉమ్మడి భూముల్లో చేపల చెరువులు, ఖండిత కందకాలు, నీటి నిల్వ కందకాలు, చెక్‌డ్యామ్‌లు తదితరాలు చేపట్టనున్నారు. నర్సరీల పెంపకం, ఈత ఇతర మొక్కల పెంపకం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత మిషన్ పనులు, వాటర్ షెడ్ పనులు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తమతమ నియోజకవర్గాల్లో ఈ పనుల జాతర కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు పాల్గొని పనులను ప్రారంభించారు.

ప్రజలకు అండగా పనుల జాతర: మంత్రి సీతక్క

ప్రజావసరాలు తీర్చుతూ అభివృద్ధిని పరుగులుపెట్టించేందుకు ఈ పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తన నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో పాల్గొని పలు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పనుల జాతర కార్యక్రమం సందర్భంగా కొత్తగూడ, గంగారం మండల కేంద్రాలలో వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. రేషన్ కార్డుల పంపిణీ చేశారు, కొత్తగూడలో రూ. 12 లక్షల వ్యయంతో అంగన్‌వాడీ కేంద్రానికి భూమి పూజ, తిరుమలగండి – పుట్టల భూపతి గ్రామాల మధ్య రూ. కోటి 60 లక్షలతో నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన, 1, కోటి 50 లక్షల నిధులతో గంగారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి పూజ, 825 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

అభివృద్ధి లక్ష్యంగా పనుల జాతర: పొన్నం

అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకే పనుల జాతర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి గుండెకాయలాంటిదన్నారు. శుక్రవారం హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో చేపట్టిన పలు పనులకు పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. సుమారు 46 పనులకు సంబంధించి రూ. 13.80 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. భీమదేవరపల్లి మండలం మల్లారంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించే అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన, వీర్లగడ్డ తండాలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.