మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారని.. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని, నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారని, కేంద్రానికి నివేదిక పంపారని.
విధాత, హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారని.. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని, నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారని, కేంద్రానికి నివేదిక పంపారని.. అంటే ఆనాటి ప్రకటన బోగస్ అని భావించాలా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 23,824 ఆవాసాలు ఉండగా 1156 ఆవాసాల్లో 50 శాతం మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అంటున్నారని, ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదని, నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏంటని డిప్యూటీ సీఎం మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరాపై ప్రస్తుతం జరుగుతున్న సర్వే, అది ఎప్పుడు పూర్తవుతుందో తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తికాగానే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి… తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
42 వేల కోట్లు ఖర్చు చేసినా ఇంకా తాగునీటి ఎద్దడి ఉందని కొత్తగూడెం, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో అదనపు నిధులు కోరడం ఏంటని నిలదీశారు.
మెట్రో నీళ్ల సరఫరా…రికార్డుల్లో మిషన్ భగీరథ నీళ్లు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచినీటిని సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు. తాగునీటి సరఫరాకి ప్రధాన సోర్స్ ను వందల కిలోమీటర్ల నుంచి కాకుండా అక్కడి సమీపంలో నుంచి తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకోవడం మూలంగా తరచూ పైప్ లైన్ లు పగిలిపోవడం వంటివి ఉత్పన్నమై తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒకరకంగా కార్మికుల వేతనాలు ఉంటున్నాయని, 8000 నుంచి 13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని మిషన్ భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని దీనిపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు కార్మికులకు ప్రయోజనం చేకూర్చాల తప్ప మధ్య వ్యక్తులకు కాదని అన్నారు. రాష్ట్రంలో మొత్తం ఉన్న ఏజెన్సీలు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు, ఏజెన్సీలు కార్మికులకు ఇస్తున్న వేతనాల వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం కోసం చేసిన వేల కోట్ల అప్పు చెల్లిస్తున్న పథకం ప్రయోజనం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమాలు అన్నారు. సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య, మెంబర్ సెక్రెటరీ టిఎస్ ఫైనాన్స్ కమిషన్ స్మిత సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.