IRCTC Tourism | వేసవికాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే ఇంటర్, పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఇక పాఠశాలలకు సైతం త్వరలోనే సెలవులు ప్రకటించనున్నారు. ఈ క్రమంలో చాలా మంది వివిధ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తుంటారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పలు రకాల ప్యాకేజీలను ప్రకటించింది. తిరుమల వెళ్లేందుకు దర్శనం టికెట్లు సైతం అవసరమున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేని వారి కోసం ఐఆర్సీటీసీ దర్శనం టికెట్లతో పాటు ప్యాకేజీలను అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రెండు రకాల ప్యాకేజీలను అందిస్తున్నది. ‘గోవిందం’ పేరుతో ఐఆర్సీటీసీ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రెండురాత్రులు, మూడు పగళ్లు పర్యటన కొనసాగుతుంది. ప్రతి రోజూ ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రైలు నంబర్ 12734 సికింద్రాబాద్, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్లగొండ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలును ఎక్కేందుకు అవకాశం ఉంది. ఈ ప్యాకేజీ ఈ నెల 20న అందుబాటులో ఉన్నది. ఈ ప్యాకేజీ ధర రూ.3,800 నుంచి అందుబాటులో ఉండనున్నది. అలాగే, ఐఆర్సీటీసీ ‘పూర్వాసంధ్య’ పేరుతో మరో ప్యాకేజీని సైతం రన్ చేస్తుంది. ఇందులో తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, తిరుచానూరు ఆలయాలను సైతం దర్శనం చేసుకోవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ప్రయాణం కొనసాగుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, లింగంపల్లి, గుంటూరు స్టేషన్స్లో ఆగుతుంది. ఈ ప్యాకేజీ సైతం ఈ నెల 20 నుంచి అందుబాటులో ఉన్నది. టికెట్ ధరలు రూ.5,660 నుంచి అందుబాటులో ఉన్నాయి. దాంతో పాటు ‘తిరుపతి బాలాజీ దర్శనం ఎక్స్ హైదరాబాద్’ పేరుతో ఎయిర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కేవలం రెండురోజుల్లోనే శ్రీవారిని దర్శనం చేసుకొని మళ్లీ ఇంటికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 6E-2005 విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 25 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ ధర రూ. 15వేల నుంచి అందుబాటులో ఉంది. ప్యాకేజీలో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, తిరుపతిలోని ఆలయాలను దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం టూరిజం వెబ్సైట్లో సంప్రదించాలని ఐఆర్సీటీసీ కోరింది.