• Telugu News
  • /Tourism

Telangana Tourism | వేసవిలో చల్లటి అరకులోయ అందాలను చూసొద్దామా..? రూ.6,999కే తెలంగాణ టూరిజం సూపర్‌ ప్యాకేజీ

Telangana Tourism | సమ్మర్‌లో విహారయాతకు వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం బంపర్‌ ప్యాకేజీని ప్రకటించింది. రూ.6,999కే అరకు అందాలను వీక్షించే అవకాశం కల్పిస్తున్నది. నాలుగు రోజుల పాటు ప్యాకేజీ పర్యటన కొనసాగనున్నది.

Reported by: Mallanna | పర్యాటకం | Apr 30, 2024, 9:33 am IST
Read Time: 4 mins
Telangana Tourism | వేసవిలో చల్లటి అరకులోయ అందాలను చూసొద్దామా..? రూ.6,999కే తెలంగాణ టూరిజం సూపర్‌ ప్యాకేజీ

Telangana Tourism | సమ్మర్‌లో విహారయాతకు వెళ్లాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం బంపర్‌ ప్యాకేజీని ప్రకటించింది. రూ.6,999కే అరకు అందాలను వీక్షించే అవకాశం కల్పిస్తున్నది. నాలుగు రోజుల పాటు ప్యాకేజీ పర్యటన కొనసాగనున్నది. వివరాల్లోకి వెళితే.. వైజాగ్‌కు 114 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉన్నది. పర్వత శ్రేణుల ప్రకృతి రమణీయత పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ అందాలను వీక్షించాలనుకునే పర్యాటకుల కోసమే తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం నాలుగు రోజుల పాటు టూర్‌ కొనసాగుతుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్‌, ఆర్‌కే బీచ్‌, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి హిల్స్‌ తదితర ప్రాంతాలను చుట్టిరావొచ్చు. ప్రయాణమంతా బస్‌లోనే ఉంటుంది. తొలిరోజు సాయంత్రం హైదరాబాద్‌ పర్యాటక భవన్‌ నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 6గంట‌ల‌కు వైజాగ్ చేరుకుంటారు.

విశాఖ‌ప‌ట్నంలోని హోట‌ల్‌లో చెకిన్ అయిన త‌ర్వాత సింహాచలం, కైలాసగిరి, రిషికొండ ప‌ర్యట‌నకు వెళ్తారు. వైజాగ్‌లో ప్రసిద్ధిచెందిన సబ్ మెరైన్ మ్యూజియం సందర్శన ఉంటుంది. అనంతం అదే రోజు సాయంత్రం వైజాగ్ బీచ్‌లో కాసేపు స‌రదాగా గడిపేయవచ్చు. రాత్రి వైజాగ్‌లోనే బస ఉంటుంది. ఆ మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరుగంట‌ల‌కు అర‌కు పర్యటనకు బయలుదేరుతారు. అర‌కు రోడ్డు ప్రయాణంలో చుట్టూ ప‌చ్చని ప్రకృతి అందాలు ప‌ర్యాట‌కులకు కనువిందు చేస్తాయి. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అరకుకు చేరుకున్న అనంతరం ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్రాగుహ‌ల‌తో పాటు అక్కడి ప్రజ‌లు చేసే ధింసా నృత్యాల‌ను సైతం వీక్షించొచ్చు. రాత్రి అరకులోనే బ‌స ఉంటుంది. నాలుగోరోజు అన్నవరం చేరుకుంటారు. అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనం అనంతరం హైద‌రాబాద్ తిరుగు ప్రయాణం ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల‌కు హైదరాబాద్ చేరుకోవడంతో అర‌కు టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. నాన్ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. టికెట్‌ ధర విషయానికి వస్తే ఒక్కొక్కరు రూ.6,999 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు రూ.5,599గా ధర నిర్ణయించారు.