విధాత: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీడీపీ బలహీనతలను స్పష్టంగా తెలుపుతున్నది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరం. అధికారం కోల్పోయిన రెండు సంవత్సరాల్లోనే ఈ స్థితికి రావడం ఆందోళన చెందాల్సిన విషయం. దాదాపు దశాబ్దం పాటు భారత రాజకీయాలలో కీలక పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు తన రాష్ట్రంలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితికి రావడం దురదృష్టకరం. చంద్రబాబు 1995 నుంచి […]
విధాత: ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక టీడీపీ బలహీనతలను స్పష్టంగా తెలుపుతున్నది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయకపోవడం ఆశ్చర్యకరం. అధికారం కోల్పోయిన రెండు సంవత్సరాల్లోనే ఈ స్థితికి రావడం ఆందోళన చెందాల్సిన విషయం. దాదాపు దశాబ్దం పాటు భారత రాజకీయాలలో కీలక పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు తన రాష్ట్రంలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితికి రావడం దురదృష్టకరం.
చంద్రబాబు 1995 నుంచి 1999 వరకు సీఎంగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఒక బాధ్యతాయుతమైన సీఎంగా ఉద్యోగులకు రాజకీయ నాయకులకు మధ్యన బ్యాలన్స్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగులలో క్రమశిక్షణ పెంచి, అవినీతిని తగ్గించి, సేవా రంగాన్ని మెరుగుపరిచాడు. హైదరాబాదులో ఐటీ రంగానికి పెద్దపీట వేసి అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానించాడు.
రాజధాని లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచాడు. ఐటీ రంగానికి ప్రతిబంధకంగా ఉన్న బీఎస్ఎ న్ఎల్ గుత్తాధిపత్యాన్ని కూలదోసి ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పించాడు. ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రణా ళిక నిపుణులు ప్రశంసించే విధంగా పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పురోగమించేలా చేశాడు.
ఇప్పుడు హైదరాబాద్ నగరం అందజేస్తున్న ఆర్థిక ఫలాలకు పునాది వేసింది నిస్సందేహం గా చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ ను మరిపించి ఆయన ఫొటో లేకుండానే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చాడు.
1999వ సంవత్సరంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబులో విపరీతమైన మార్పు వచ్చింది. ప్రజలతో సంబంధాలు తెంచుకున్నాడు. కొంతమంది భజన పరుల చేతిలో బంధీగా మారి పొగడ్తలను మాత్రమే వినడానికి ఇష్టపడ్డాడు.
చేదు నిజాలు, కఠిన వాస్తవాలు చెప్పే వారిని దూరం పెట్టాడు. అధికారులు పూర్తిగా అజమాయిషీ చేయడం ప్రారంభించారు. ఒక విధంగా “పొలిటికల్ డయాబెటిస్” అనే వ్యాధి సంక్రమించిందని చెప్పవచ్చు. “ఇక్కడ పొగడ్తలు మాత్రమే వినబడును” అనే కనిపించని బోర్డు పెట్టుకున్నాడు.
పోటీ పడి పొగడ్తలతో ముంచెత్తి అధికారులను మాత్రమే దగ్గర పెట్టుకొని, వాస్తవాలను చెప్పే వారిని శత్రువులుగా భావించాడు. కాంగ్రెస్ పార్టీ బలహీనమైనదని భావించి సొంత పార్టీలో స్వతంత్రంగా వ్యవహరించే ప్రజాదరణ కలిగిన నాయకులను కట్టడి చేయడం ప్రారంభించాడు.
అనంతపురంలో పరిటాల రవి, మెదక్ లో కేసీఆర్ ఇంకా అనేక మంది అయుష్టుల జాబితాలో చేరిపోయారు. ఈ సమయంలోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన కారులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకుండా సలహాదారుల సూచనలతో మొండి వైఖరి అవలంబించడం వలన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతం అయింది.
ఎన్టీఆర్ 1985 లో విడుదల చేసిన 610 జీవో అమలు చేసి, కేసీఆర్ ను దూరం చేసుకోనట్లయితే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు అనే భావం ప్రబలంగా ఉన్నది. ప్రతిపక్ష నాయకుడిగా తొమ్మిది సంవత్సరాలు ఉన్న తర్వాత 2014లో అధికారంలోకి వస్తే తన పద్దతిని మార్చుకుని 1995 నుంచి 1999 మధ్య కాలంలో అందించిన ఉత్తమ పాలనను అందిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.
శివారెడ్డి హత్యకు గురైతే ఎన్టీఆర్ శవాన్ని భుజంపై వేసుకొని రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తే ప్రతి కార్యకర్త ఉత్తేజం పొందాడు.మేము కాటికిపోయే వరకు మా ఎన్టీఆర్ మాకు అండగా ఉంటాడని భావిం చిన కార్యకర్తలు పార్టీకి రక్షణ కవచంలా ఉన్నారు. అలాంటి పార్టీ వలస పక్షుల పార్టీగా మారింది.
పార్టీకి సంబంధం లేని బడా పారిశ్రామికవేత్తలు నామినేటెడ్ పదవులు పొందారు. క్రమేపీ రాజ్యసభ లో అత్యంత సంపన్నమైన పార్టీగా రూపాంతరం చెందింది. తప్పటడుగు వేసి తెలంగాణలో బలమై న పార్టీని నష్టపరచుకున్నాడు. వైసీపీ నుంచి శాసనసభ్యుల ను తీసుకొని మంత్రులను చేసి దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కార్యకర్తలను నిరాశపరిచాడు.
పొలిటికల్ డయాబెటిస్ వ్యాధి ముదిరి ఇనుప తెర కట్టుకుని “హితుల మాట వినడు, అరుంధతిని చూడడు” అనే దశకు చేరాడు. 2019లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే స్థాయికి చేరినప్పటికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అంచనా వేయకుండా, తామే అధికారంలోకి వస్తామని చివరి ఫలితాలు వెలువడే వరకు నమ్మకంతో ఉండడం ఆశ్చర్యకరం.
తెలంగాణ ప్రాంతంలో ఒక్క సీటు కూడా గెలవకుండా కేవలం ఆంధ్ర ప్రాంతంలో గెలుచుకున్న సీట్లతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అని వైసీపీకి వచ్చిన మెజారిటీ నిరూపించింది. ఓటరు ప్రవర్తనా శైలిని సూక్ష్మస్థాయిలో నిర్ధారించే వివిధ పద్ధతులు అమలులో ఉన్న ప్రస్తుత కాలంలో ఆంధ్ర ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడు.
రాష్ట్రంలో ఇంత పెద్ద భూకంపం ఏర్పడుతుంటే నిజాయితీ లేని ఇంటలిజెన్స్ అధికారులు, బోగస్ సర్వే సంస్థలు, చుట్టూ చేరిన భజనపరులు కలిసి పంచదార తెర కట్టి నావ మునిగేంత వరకు తీపి కబుర్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలు పారిపోయారు. దళారులు గోడ దూకారు, కార్యకర్తలు తప్పుకు న్నారు.
అనేక బలహీనతలు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడంలో టీడీపీకి అనుభవం ఉన్నది కానీ ఒక వ్యక్తి నాయకత్వంలో సమీకృతమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కున్న అనుభవం లేదు. మారిన పరిస్థితుల్లో ఎలా మనుగడ సాగించాలో తెలియని అయోమయంలో పార్టీ ఉన్నది.
ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న బలహీన వర్గాలను మాత్రమేగాక ఉత్తర భారత దేశంలోని జాట్ లను కూడా టీడీపీకి అనుబంధం చేశాడు. ఎన్టీఆర్ భారత దేశం పార్టీ పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయనకు ఉత్తర భారతదేశంలో రైతులలో ఉన్న అభిమానం తెలియని వారు హేళన కూడా చేశారు.
కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేషనల్ అలయెన్స్ ఏర్పాటు చేసినప్పుడు జాట్ నాయకుడు దేవీలాల్ దక్షిణాది చౌదరిగా ఎన్టీఆర్ ను ఉత్తరాది రాష్ట్రాలలో పరిచయం చేశాడు. ఎన్టీఆర్ ఉత్తరాది రాష్ట్రాలలో జాట్ ల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన ప్రసంగాలకు లక్షలాది మంది వచ్చారు.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఐటీ రంగంలో సంస్కరణలు తెచ్చినప్పుడు జాట్ వర్గం చంద్రబాబును తమ వాడిగా మురిసిపోయారు. విదేశాలలో ఉన్న జాట్ యువకులు చంద్రబాబు గురించి గొప్పగా చెప్పుకొనేవారు. దేవీలాల్ మరణించిన తరువాత జాట్ వర్గానికి సరైన నాయకుడు కరువైన సమయంలో చంద్రబాబును చూసి వారు ముచ్చట పడేవారు.
చంద్రబాబు చుట్టూ ఉన్న వారు ఈ పరిణామం గమనించలేదు. గమనించిన వారికి ఈ విషయం చెప్పే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. అందుకే ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో చంద్రబాబుకు దక్షిణాది రాజకీయ నాయకుల అందరికంటే ఎక్కువ ప్రాచుర్యం ఉన్నది.
పొలిటికల్ డయాబెటిస్ వ్యాధికి గరై ఉత్తరప్రదేశ్ లో మాయావతి, పంజాబ్ లో అమరేందర్ సింగ్ అధికారానికి దూరం కాగా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ చంద్రబాబు అడుగు జాడలలో నడుస్తూ భజన పరుల పొగడ్తలలో మునిగి వాస్తవాన్ని చూడకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు.
ఇప్పటికైనా చంద్రబాబు తన బలహీనతలను తెలుసుకొని ఎన్టీఆర్ చూపిన మార్గంలో పయనిస్తే టీడీపీకి పూర్వవైభవం వస్తుంది. బీజేపీతో స్నేహం కొరకు గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు వృథాగా ప్రయత్నిస్తున్నాడు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాల వలన దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ సంబం ధాలు, రాజ్యాంగ వ్యవస్థ లు దెబ్బతిన్నాయి.
ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ప్రజలు ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్నారు. పాకిస్తానీ టెర్రరిస్టుల దుశ్చర్యలు తప్ప మోదీని వచ్చే ఎన్నిక లలో ఎవరూ రక్షించ లేరు. మోదీ బలహీనతలను కుణ్ణంగా తెలిసిన చంద్రబాబు 2019 లో జరిగిన ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని నామరూపాలు లేకుండా చేశాడు.
దేశంలోనే బీజేపీని ఇంతగా నష్ట పరచిన వారు ఎవరూ లేరు. పక్క రాష్ట్రంలో పేరు తెలియని వ్యక్తులు ప్రాంతీయ పార్టీలను నడుపుతున్నారు. జాతీయ స్థాయిలో నాయకత్వ శూన్యం స్పష్టంగా ఉన్నది. రైతు, నిరుద్యోగ, ప్రభుత్వ ఆస్తుల పంపిణీ, ఆర్థిక సంక్షోభం, రాఫెల్ కుంభకోణం, పెట్రోలు ధరల లాంటి వివిధ సమస్యలపై జాతీయ స్థాయిలో నిరసన తెలిపే వేదిక కరువైంది.
జాతీయ స్థాయిలో వివిధ పక్షాలను సమన్వయం చేసి, వచ్చే ఎన్నికలలో దేశానికి లౌకిక ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంబించాల్సిన సమయం లో మోడీ ప్రాపకం కొరకు ప్రయత్నిం చడం వృథాయే అవుతుంది.
-డాక్టర్ నాగేందర్ రావు మాధవరం