బనకచర్లకు కట్టుబడే ఉన్నాం : స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుపై కట్టుబాటు వ్యక్తం చేస్తూ, రాయలసీమ అభివృద్ధి, సంక్షేమం, వైసీపీపై విమర్శలు చేశారు.

బనకచర్లకు కట్టుబడే ఉన్నాం : స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ

అమరావతి, ఆగస్టు 15: రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించడం ద్వారా సముద్రంలోని వృధానీటిని వినియోగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం లేదని..ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నామని..అదే వరద నీటిని దిగువ రాష్ట్రంగా వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకని అడుగుతున్నానని..వరదను భరించాలిగాని..వరదనీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం, బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల విషయంలో చేస్తున్న వాదనల నేపథ్యంలో ఏపీ వాదనను.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేదికగా మరోసారి స్పష్టం చేయడం ఆసక్తి పరిణామంగా నిలిచింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన దేశ స్వాంతంత్ర్య దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఇరిగేషన్ రంగంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ బనకచర్లకు కట్టుబడే ఉన్నామని..తెలంగాణ అభ్యంతరాలను తోసిపుచ్చారు. హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పని చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూనే.. ఈ ఏడాది ఉత్తరాంధ్ర, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

సంక్షేమం..అభివృద్ధిలో రాష్ట్రం ముందడుగు

రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రధానంగా చంద్రబాబు వివరించారు. సూపర్ సిక్స్ హామీలు మొదలుకుని…కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాలను.. శుక్రవారం స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వరకు ప్రతి అంశాన్ని వివరించారు. ఫించన్లు, తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ వంటి పథకాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పాటు.. తాను చేసిన తొలి సంతకాల అమలును ముఖ్యమంత్రి వివరించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా 64 లక్షల మందికి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందించామన్నారు. అలాగే ఏపీ బ్రాండ్ గురించి.. పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలోని వివిధ వర్గాలకు అందించిన సేవలను.. ఆయా రంగాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి రంగంలో రాష్ట్రం ముందుకెలుతుందన్నారు. మెగా డీఎస్సీ నియామకాలను ఈ నెలాఖరుకు పూర్తిచేస్తామని తెలిపారు.

వైసీపీ తీరుపై చంద్రబాబు చురకలు

శాంతి భద్రతలపై ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించిన సందర్భంగా పరోక్షంగా వైసీపీకి చంద్రబాబు చురకలంటించారు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తూ.. ప్రొత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను వివిధ సందర్భాల్లో చంద్రబాబు ప్రస్తావించారు. ‘2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఏపీ బ్రాండ్‌ను నాశనం చేసిందన్నారు. రాజ్యాంగ, పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని.. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదదని..రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదన్నారు. తవ్వినకొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగుచూస్తున్నాయని.. పోలవరం నిలిచిపోగా.. అవరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు ప్రతి శాఖలో వెలుగు చూస్తున్నాయని గత పాలకుల తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం నిలిపేసిన పథకాలను తాము పునరుద్దరించామనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాం. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తిరిగి తెరిచామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడిన డ్రామాలను గుర్తు చేశారు. కొత్త జిల్లాలను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందని.. ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. మద్యం, ఇసుక వంటి వాటిల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తావించిన చంద్రబాబు. ఇక ఎస్సీలకు, మైక్రో, డ్రిప్ సబ్సీడీలను గత ప్రభుత్వం నిలిపేసిందని గుర్తు చేయడంతోపాటు.. గతంలో జరిగిన రెవెన్యూ అక్రమాలను సరి చేసి.. పేదల భూములకు రక్షణ కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు పంద్రాగస్టు ప్రసంగంలో వెల్లడించారు. తాజాగా కేంద్రం ప్రభుత్వం కేటాయించిన సెమీ కండక్టర్ల యూనిట్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధుల కేటాయింపు వంటి అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. దీంతోపాటు ఇటీవల అమెరికా భారతదేశంపై విధించిన సుంకాల నేపథ్యంలో మన దేశ ఎకానమీ గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ప్రధానికి అండగా ఉంటామని చంద్రబాబు సంకేతామిచ్చారు. అలాగే ఆపరేషన్ సిందూర్ చేపట్టిన త్రివిధ దళాలకు సీఎం స్వాతంత్ర్య దినోత్సవ వేదికపై నుంచి సెల్యూట్ చేశారు. వివిధ శాఖల ప్రగతిని వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి…

ఇక మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్​? – బిసిసిఐ మదిలో గిల్​!

ఓటు చోరీ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదాం