earthquake : మేడారం అడవుల కేంద్రంగా భూప్రకంపనలు.. నిపుణులకు పరీక్షగా మారిన ప్రాంతం
అప్పుడు పరిసర ప్రాంతాల్లో పెద్ద వరదలు సంభవించి చెట్లు ధ్వంసం అయ్యాయి. కానీ ఇప్పుడు భూకంపం అదే అటవీ ప్రాంతం కేంద్రకంగా చోటు చేసుకోవడంతో పరిశోధకులు లోతుగా పరిశోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

విధాత ప్రత్యేక ప్రతినిధి:
ప్రకృతి వైపరీత్యాలకు మేడారం అటవీ ప్రాంతం కేంద్రబిందువుగా మారింది. ఈ ప్రాంతంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో జరిగిన భూకంపం ములుగు అటవీ ప్రాంతంలోని మేడారం సమీపంలోని రామన్నగూడెం కేంద్రంగా చోటు చేసుకున్నట్టుగా అధికారులు నిర్ధారించారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో ములుగు జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన మేడారం సమీపంలోని దట్టమైన అడవిలో 50వేలకు పైగా చెట్లు ఒక్కసారిగా నేలకూలిన సంఘటన తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ సంఘటనకు పూర్తి కారణాలను తెలుసుకోలేకపోయారు. నిపుణులు దానికి సంబంధించిన విశ్లేషన్లో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన మూడు నెలలకు డిసెంబర్ 4న బుధవారం రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తుంది.
గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్న మేడారం కేంద్రంగా 40 కిలోమీటర్ల లోతులో ఏర్పడిన ఈ భూకంపం ప్రభావం 225 కిలోమీటర్ల విస్తీర్ణంలో తెలంగాణ, ఏపీ, చత్తీస్ గడ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాల్లో సంభవించినట్టుగా అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేట్ పై 5.3గా నమోదయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. భూకంపానికి గల కారణాలు ఏమిటీ అన్న విషయంపై సిస్మలాజికల్ విభాగం నిపుణులు పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు సమీపంలో బొగ్గు గనులు కూడా ఉన్నాయి.
మేడారం సమీప ప్రాంతంలో
ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతం కేంద్రంగానే జరిగిన భూకంపం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 4న ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో ప్రకృతిలో పెను మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే. సుడిగాలుల బీభత్సం కారణంగా 50 నుండి 70 వేల మేర చెట్లు నేలకూలిపోయాయి. సుడిగాలి తీవ్రత ఏ స్థాయిలో చోటు చేసుకుందంటే… చెట్ల వడిపెట్టినట్టుగా చుట్టుకపోగా ఇరువైపులా వంగిపోయాయి. మరికొన్ని చెట్లు అయితే చీలికలు కాగా… ఇంకొన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించబడ్డాయి. దేశంలోనే అత్యంత అరుదైన ఘటనగా అటవీ శాఖ అధికారులు సెప్టెంబర్ 4న జరిగిన ఘటనపై వివరించారు. పరిశోధనలు జరిపేందుకు నిపుణులను కూడా రంగంలోకి దింపుతున్నామని అటవీ శాఖ అధికారులు అప్పుడు ప్రకటించారు. తాజాగా బుధవారం వచ్చిన భూకంపం కూడా ఇదే ప్రాంతంలో సంభవించిందని సిస్మోలాజికల్ విభాగం నిర్దారించడం గమనార్హం. మేడారంలో గాలి దుమారం రేకెత్తిన ఘటన జరిగిన సరిగ్గా మూడో నెల రోజునే భూకంపం సంభవించిడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ మొదటి వారంలో మేడారం అడవుల్లో ప్రకృతి ప్రళయం సృష్టించగా, డిసెంబర్ 4న భూకంపం సంభవించడం గమనార్హం.
– పరిశోధకులకు పరీక్ష
మేడారం అడవుల్లో సెప్టెంబర్ 4న చోటు చేసుకున్న సుడిగాలుల ప్రభావంపై అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ… సహజంగా చెట్లు భూమి లోపల కూడా విస్తరించుకుంటాయని, వేర్ల ద్వారా భూమి లోపలి నుండి వృక్షాలకు అవసరమైన పోషక విలువలు అందుతుంటాయని అన్నారు. అయితే ములుగులో మాత్రం ఈ పరిస్థితికి భిన్నంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలోని గాలిలోనే చెట్లకు అనుకూలమైన పరిస్థితులు ఉండడంతో భూమి లోపలకు చెట్లు విస్తరించడం లేదని వెల్లడించారు. గాలి దుమారం వల్ల భారీ వృక్షాలు కూడా నేలకూలిపోవడానికి కారణం అయి ఉంటుందని భావిస్తున్నామన్నారు. అప్పుడు ఇవే అటవీ ప్రాంతంలో వాటర్ స్పౌట్స్ కూడా ఏర్పడడంతో అక్కడ నీటి వనరులు కూడా విస్తారంగా ఉండడమే కారణమనే అంచనా వేశారు. కానీ తాజాగా ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపం నిపుణుల పరిశోధనలకు ప్రతిష్టగా మారింది. అప్పుడు పరిసర ప్రాంతాల్లో పెద్ద వరదలు సంభవించి చెట్లు ధ్వంసం అయ్యాయి. కానీ ఇప్పుడు భూకంపం అదే అటవీ ప్రాంతం కేంద్రకంగా చోటు చేసుకోవడంతో పరిశోధకులు లోతుగా పరిశోధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.