Rising Skyscrapers | హైదరాబాద్‌.. ఇక వర్టికల్‌ సిటీ! ఆకాశహర్మ్యాలలో మనమే టాప్‌.. ఎన్నో తెలిస్తే షాకే!!

హైదరాబాద్‌లో స్కైస్క్రాపర్స్‌ ట్రెండ్‌ విచ్చలవిడిగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తున్నది. ప్రత్యేకించి కోకాపేట, నియోపొలిస్‌ వంటి ప్రాంతాల్లో ఆకాశాన్నంటే భవనాలు లెక్కకు మించి నిర్మాణంలో ఉండటం.. నగరానికి అలంకారమా? ప్రమాదమా? అనే చర్చ మొదలైంది.

Rising Skyscrapers | హైదరాబాద్‌.. ఇక వర్టికల్‌ సిటీ! ఆకాశహర్మ్యాలలో మనమే టాప్‌.. ఎన్నో తెలిస్తే షాకే!!

(జగన్మోహన్‌ తాళ్లూరి)

ఆకాశహర్మ్యాల నిర్మాణంలో హైదరాబాద్‌ కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఆకాశహర్మ్యాల నగరాలతో పోటీ పడటమే కాదు.. ఆకాశహర్మ్యాల రాజధానిగా ముందుకు వచ్చింది. సులభంగా చెప్పాలంటే.. ఇప్పటికే సంప్రదాయ రియల్‌ఎస్టేట్‌ నగరాలుగా పేర్గాంచిన బెంగళూరు, పుణె, కోల్‌కతా, గురుగ్రామ్‌, నోయిడాలో ఎన్ని ఆకాశహర్మ్యాలు ఉన్నాయో.. అన్ని ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయని అంటున్నారు. హైదరాబాద్‌లో 100 మీటర్లకు మించిన ఎత్తుతో ఇప్పటికే నిర్మాణం పూర్తయినవి, లేదా చురుకుగా నిర్మాణాలు కొనసాగుతున్నవి సుమారు 407 ఉన్నాయని రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి అధికారిక ధృవీకరణ లేదు. ఏది ఏమైనా ఒకప్పుడు లోరైజ్‌ సిటీగా పేరున్న హైదరాబాద్‌.. దేశంలోని ఇతర నగరాలతో కాకుండా.. ప్రపంచస్థాయి వర్టికల్‌ సిటీలతో పోటీ పడుతూ.. నగరాన్ని ఆకాశహర్మ్యాల రాజధానిగా మార్చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆకాశహర్మ్యాల విషయంలో ఇవన్నీ ఎక్కువగా కోకాపేట్‌, నియోపొలిస్‌ చుట్టూ కేంద్రీకృతమై.. ఈ ప్రాంతాన్ని స్కైస్క్రాపర్స్‌ ఎపిక్‌ సెంటర్‌గా మార్చివేశాయి. నగరంలోని టాప్‌టెన్‌ ఎత్తయిన టవర్లలో 60 శాతం వరకూ ఇక్కడే ఉన్నాయని చెబుతున్నారు.

ఉదాహరణకు..

  • SAS Crown – 236 మీటర్లు, 58 అంతస్తులు (2027నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి)
  • Candeur Skyline – దీని నిర్మాణం పూర్తయితే.. సుమారు 244 మీటర్ల ఎత్తున ఉంటుంది. హైదరాబాద్‌లో ఇదే అత్యంత టాలెస్ట్‌ బిల్డింగ్‌ కానుంది.
  • Brigade, L&T లాంటి దిగ్గజ సంస్థల 50+ అంతస్తుల లగ్జరీ క్లస్టర్లు నిర్మిస్తున్నాయి.
  • ఇవి కాకుండా మరికొన్ని ఆకాశహర్మ్యాల నిర్మాణానికి రంగం సిద్ధమవుతున్నది.

అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న ముందుకు వస్తున్నది. ఈ వర్టికల్‌ డ్రీమ్‌కు గ్రౌండ్‌ రియాలిటీ అంతే స్థాయిలో ఉందా? మీరు గమనిస్తే హైదరాబాద్‌లో సాధారణంగానే నివాసభవనాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు వెయ్యిమంది నివసించే కాలనీల్లో ఇప్పుడు నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లతో ఐదారువేల మంది, కొన్ని ప్రాంతాల్లో పదివేల మంది నివసిస్తున్నారు. దానితో నిర్దిష్ట సమయాల్లో వందల వాహనాలు ఒకేసారి రోడ్డు మీదకు రావడం వంటి వాటితో ఇప్పటికే ఇరుకుగా ఉన్న రోడ్లపై నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతున్నది. అది యావత్‌ సిటీపై ప్రభావం చూపుతున్నది. ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్టివిటీ అంశాలు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. మరోవైపు మురుగునీటి పారుదల, మంచినీటి సరఫరా.. ఈ రెండూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. నీటి సరఫరా కూడా కష్టంగా మారుతున్నది.

మున్సిపల్‌ నీటి సరఫరా అంశాన్ని పక్కన పెడితే.. ఆయా అపార్ట్‌మెంట్లలో వందల అడుగుల లోతు నుంచి నీటిని తోడేస్తున్నారు. ఇదొక కొత్త ప్రమాద ఘంటికను మోగిస్తున్నది. సహజంగా భూమిలో అట్టడుగు పొరల్లో భూగర్భ జలాలు ఉంటాయి. సింపుల్‌ లాజిక్‌లో చెప్పాలంటే.. ఆ నీరు ప్రవహించే ప్రాంతాలు ఖాళీగా మారితే.. పైనున్న బరువుకు ఆ ప్రాంతం కుంగిపోతుంది. అది భూగర్భ జలాల తోడివేత–రీచార్జ్‌ సమతుల్యంపై ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు దిగజారి.. తోడివేస్తున్న నీటితో సమానంగా భూగర్భ జలాలు రీచార్జ్‌ కాని పక్షంలో పెను విషాదాలకు ఆకాశహర్మ్యాలు యథేచ్ఛగా నిర్మిస్తున్న నగరాలు కేంద్రంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also |

Telangana Municipal Election Schedule : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Postal Department | 28,740 పోస్టుల భ‌ర్తీకి పోస్ట‌ల్ శాఖ నోటిఫికేష‌న్‌.. ప‌ది పాసైతే చాలు ఉద్యోగం..!
silver price hike| వెండి ఒక్క రోజునే రూ.12వేలు పైకి..స్థిరంగా బంగారం