సినీ నటుడు కళాప్రపూర్ణ గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా…

విధాత:“పంచె కట్టులోన ప్రపంచాన మొనగాడు ఎవడురా ఇంకెవడు తెలుగువాడు.” హుందాగా మూర్తీభవించిన ఆంథ్రుడుగా,ప్రశాంత వదనంతో, నిత్యం చిరునవ్వుతో,తెలుగుదనానికి నిలువెత్తు చిరునామాగా మనకు కనిపించే మహామనిషి,గుమ్మడి వెంకటేశ్వరరావు. తెలుగు సినిమారంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన మహానటులు. నటుడన్న తరువాత అన్ని పాత్రలను పోషించి మెప్పించాలి. తండ్రిగా, రైతుగా, జమీందారుగా, తేనెపూసిన కత్తిలాంటి విలన్ గా… మరెన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు వారి మన్ననలను పొందిన 'మంచి గుమ్మడి […]

సినీ నటుడు కళాప్రపూర్ణ గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా…

విధాత:“పంచె కట్టులోన ప్రపంచాన మొనగాడు ఎవడురా ఇంకెవడు తెలుగువాడు.” హుందాగా మూర్తీభవించిన ఆంథ్రుడుగా,ప్రశాంత వదనంతో, నిత్యం చిరునవ్వుతో,తెలుగుదనానికి నిలువెత్తు చిరునామాగా మనకు కనిపించే మహామనిషి,గుమ్మడి వెంకటేశ్వరరావు.

తెలుగు సినిమారంగంలో అతి చిన్న వయసులో అతి పెద్ద పాత్రలు ధరించి అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన మహానటులు.

నటుడన్న తరువాత అన్ని పాత్రలను పోషించి మెప్పించాలి. తండ్రిగా, రైతుగా, జమీందారుగా, తేనెపూసిన కత్తిలాంటి విలన్ గా… మరెన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు వారి మన్ననలను పొందిన ‘మంచి గుమ్మడి పండు’ లాంటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అన్ని పాత్రలకూ న్యాయం చేకూర్చి నప్పటికీ,ప్రేక్షకులు మాత్రం వారిని సాత్వికమైన పాత్రల్లోనే చూడటానికి ఇష్టపడేవారు.బహుశా:ఆ పాత్రలు ఆయన స్వభావానికి దగ్గరగా ఉండటం వల్లనేమో ! తెలుగు భాషను ఎంత మధురంగా పలకాలో ఈ తరం నటీనటులు నేర్చుకోవాలంటే, వారి సినిమాలన్నిటినీ చూసి తీరవలసిందే !

బాల్యం-తొలి జీవితం :

గుమ్మడి జులై 9 1927 న గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలోని “రావికంపాడు” గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు మొదటి సంతానంగా జన్మించారు.ఈ మహానటుణ్ని కన్న తల్లిదండ్రులు, బసవయ్య, బుచ్చమ్మ ల పూర్వపుణ్య ఫలము వలన జన్మించిన గుమ్మడి ఇంతటి మహానటుడౌతాడని వారు ఊహించి ఉండరు.ఉమ్మడి కుటుంబంలో మొదటి సంతానంగా స్థానిక కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ అతను ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. హైస్కూలు విద్య ముగియగానే వారి వ్యవసాయ వృత్తిలోనే గుమ్మడిని కొనసాగించాలని భావించారు. దైవ నిర్ణయమును ఎవరూ మార్చలేరు కదా ! వారి పూర్వజన్మ సుకృతము ఊరకనే పోవునా ?

గుమ్మడి స్థానిక పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఇతనిని ప్రభావితుని చేసిన వ్యక్తి వారి తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు తరగతిలో గుమ్మడి మాట్లాడు విధానము, ఉచ్ఛారణ చూసి అవియే, అతని భవిష్యత్తుకు గట్టి పునాదులని తలచి ఆ విధముగా ప్రోత్సహించెను. తరగతి గదిలో పాఠ్యపుస్తకము తీసుకొని బిగ్గరగా చదవమని అతని వాగ్దాటి, స్వరము, వాచకము, ఇతర విద్యార్ధులను, ఉపాద్యాయులను, అబ్బురపరచేది. ఈ వయస్సులోనే గుమ్మడికి ఆశక్తికరమైన పుస్తక పఠనము బాగుగా అలవడినది. ఈ ఒరవడిలో నడుచుచున్న ఈ బాలునికి కమ్యూనిష్టు భావజాలము నందు ఆశక్తి ఉన్నట్లు తెలిసినది.

పిమ్మట కళాశాల చదువులకు గుంటూరు హిందూ కళాశాలలో చేర్పించుటకు తీసుకొని వెళ్ళగా అప్పటి ప్రిన్సిపాలుతో ఇతనికి రాజకీయము నందు ఆశక్తి మెండు అని మనవి చేసిరి. అప్పుడు ప్రిన్సిపాల్ గారు చిరునవ్వుతో ఇట్టి ఆశక్తి ఉన్న విద్యార్థులు కూడా మాకు అవసరమే అని చేర్చుకొనిరి. గుమ్మడి కళాశాల విద్య ఎక్కువ కాలము సాగినట్లు కనిపించలేదు. ఆ రోజులలోనే నాటకములలోను, సినిమాలలోను, చేరవలెనన్న ఆశక్తి మొలకెత్తినది. గ్రామములోని తోటి విద్యార్థులను, మిత్రులను పోగు చేసి, పద్యము లేని వచన నాటకములు ఆడుచూ నటునిగా, ఆ ప్రాంతము నందు ఈతనికి గుర్తింపు వచ్చెను.

తెనాలిలో రేడియో షాపు :

ఈ అవకాశము చూచుకొని తన మార్గము వెతుకుతూ మిత్రులతో కలిసి తెనాలిలో రేడియో షాపు ప్రారంభించెను. ఇది నామ మాత్రమే. కళలకు, నాటకాలకు, సినిమా వృత్తులకు ఆలవాలమైన తెనాలిలలో, ప్రముఖులు సందర్శించిన, నప్పుడు వారిని కలుసుకొని సినిమాలలో ప్రయత్నము చేయుటకు అవకాశము కలిగెను.

జేబులో చిల్లి గవ్వ కూడా లేదు :

మహానటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌. సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో సైతం ఆయన కన్నతల్లి లాంటి నాటకరంగాన్ని విస్మరించలేదు. ‘పృథ్వీ థియేటర్‌’ పేరుతో నాటక సంస్థను నెలకొల్పి, బొంబాయిలో శాశ్వత ప్రదర్శనశాలను నిర్మించి, క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శిస్తూ, సజీవ కళతో ప్రేక్షకులకు చేరువగా ఉండే వారాయన. అందుకు కావలసిన ఆర్థిక వనరుల కోసం పృథ్వీరాజ్‌ కపూర్‌ ప్రతి ప్రదర్శన తర్వాత తన బృందంతో పాటు జోలెతో ప్రేక్షకుల మధ్యకు వచ్చి విరాళాలు అర్థించేవారు.

ఓ రోజు ప్రదర్శన తర్వాత జోలెతో వచ్చిన ఆ మహానటుణ్ని చూసి ప్రేక్షకుల్లోని ఓ తెలుగు యువకుడు చలించిపోయాడు. అప్పుడప్పుడే తెలుగునాట రంగస్థలం మీద పేరు తెచ్చుకుంటున్న ఆ యువకుడు వెంటనే తన జేబులోని పర్సును బయటకు తీశాడు. అందులోని పూర్తి మొత్తాన్ని జోలెలో వేసి చెమ్మగిల్లిన కళ్లతో పృథ్వీరాజ్‌ కపూర్‌కు నమస్కరించి, గంభీరంగా బయటపడ్డాడు.

హోటల్‌ గదికి వచ్చి చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణానికి జేబులో చిల్లి గవ్వ కూడా మిగల్లేదని ఆ యువకుడికి అర్థమయింది. చివరకు స్నేహితుడు ఆదుకోవడంతో ఎలాగో సొంతూరు చేరుకున్నాడు. అక్కడ కట్‌చేస్తే- అనంతర కాలంలో ఆయన మద్రాసు చేరుకున్నాడు. అవకాశాల కోసం తలుపు తట్టాడు. ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బు కరిగిపోవడంతో నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నాడు. చివరకు ఆ యువకుడి శ్రమ ఫలించింది. తెలుగు చలన చిత్రరంగం ఆయనకు ‘క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌’గా పట్టం కట్టింది. మోతాదు మించని హావభావాలకూ, స్పష్టమైన వాచకానికీ పేరెన్నికగన్న ఆ నటుడే గుమ్మడి వెంకటేశ్వరరావు.

సినిమా రంగం :

గుమ్మడి హావభావములు, కంఠస్వరము, గమనించిన పలువురు దర్శకులు వీరు హీరో కన్నా ఇతర పాత్రలకు సరిపోవునని తీర్మానించుకొని ప్రోత్సహించిరి. ఇది 1950 వ సంవత్సరమున జరిగిన ఘటన. గుమ్మడి గారి తొలిచిత్రాలు, అదృష్టదీపుడు, పిచ్చిపుల్లయ్య, అనుకున్న విజయాలు సాథించకపోయినా నటుడిగా ఆయనకు ఒక గుర్తింపు వచ్చినది.

మిస్సమ్మ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించినది మూడు నిమిషములైనా ముక్కోటి ఆంథ్రులను ఆకర్షించిన అవకాశము గుమ్మడికి కలిగినది. ఆ చిత్రములో చిన్న పాత్ర అందులోను గెస్ట్, పారితోషకము అడగకపోయినా శ్రీ నాగిరెడ్డి గారు సవృదయంతో ఇచ్చిన రోజు వారికి అమితానందము కలిగించినది. తరువాత గుమ్మడి గారు వెనుదిరిగి చూడలేదు. తండ్రిగా , అన్నగా, మామగా, జమీందారుగా, పోలీసు అధికారిగా, ప్రతినాయకునిగా, సాంఘికపాత్రలు, జానపదాలలో రాజుగా మంత్రిగా రాజగురువుగా విభిన్నపాత్రలు, పౌరాణికాలలో బలరామునిగా కర్ణుడిగా, దుర్యోథనునిగా, నటించి నాటి మేటి నటులు శ్రీ ఎన్. టి. రామారావు, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ ఎస్, వి రంగారావు గార్లతో సమ ఉజ్జీగా ఉత్తమమైన నటన ప్రదర్శించి “శభాష్ ” అనిపించుకున్న నటుడు శ్రీ గుమ్మడి. మహా మొహమాటస్తుడు కావడంచేత నిర్మాతల నుంచి పూర్తిపారితోషికం తీసుకోని సంఘటనలు చాలా ఉన్నాయి. ఆయన బలహీనతలు, కుటుంబ బాద్యతలు, బాగా తెలిసిన వ్యక్తీ కావడంచే, దర్శకుడుగా కాని., నిర్మాతగా కాని , ప్రయోగాలు చెయ్యలేదు.

పుస్తక ప్రేమికుడు:

సినీరంగంలో మృదుభాషిగా, సహృదయుడుగా పేరు తెచ్చుకున్న గుమ్మడి పుస్తక ప్రేమికుడు. సమయము దొరికినప్పుడు మంచి పుస్తకాలను చదివే రసజ్ఞుడు. ఇతని అభిరుచిని గమనించి ఈ రస హృదయునికి ప్రఖ్యాతకవి, రచయిత శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక కావ్యమును అంకిత మిచ్చిరి. ఇది సామాన్య విషయం కాదు !

అవార్డులు:

గుమ్మడి వంటి మహానటుని 50 సంవత్సరముల సుదీర్ఘ నటనారంగంలో సాధించిన ఘనతకు గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు “కళాప్రపూర్ణ బిరుదుతోను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు “రఘుపతి వెంకయ్య” అవార్డుతోను సత్కరించిరి. వీరు 3 సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్ గాను, 2 సార్లు నంది అవార్డ్స్ కమిటి సభ్యులుగాను నియమించబడిరి. ఇది మరియే నటుడికి దక్కని గౌరవము.
తెలుగు విశ్వవిద్యాలయము వారు గౌరవ డాక్టరేట్ బిరుదును వారి మహామంత్రి తిమ్మరసు చిత్రిములోని పాత్రను చూచిన తరువాత బహూకరించిరి. మరోమలుపు చిత్రమునకు ఉత్తమ నటుడు అవార్డు దక్కినది. ఆయన ఏడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

వీరు నటించిన 500 చిత్రములలో 90 శాతము అందరి ప్రశంసలు అందుకొన్నవే… జాతీయ సినిమా బహుమతులకు న్యాయనిర్ణేతగా మూడు సార్లు, రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు, రఘపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.

1978 మరియు 1982 లో తాష్కెంట్ చలన చిత్రోత్సవానికి దక్షిణ భారతదేశం నుండి భారత ప్రతినిధి బృందంలో అధికారిక సభ్యుడు.

ఈ మహానటుడు తెలుగు సినిమా రంగంలో తన అనుభవాలను తీపి గుర్తులు, చేదు జ్ఞాపకాలు అన్న పేరున పుస్తక రూపములో ప్రచురించారు.

వీరు చివరి సారిగా జనం మధ్య కనిపించినది, మాయాబజార్ చిత్రం రంగులలో విడుదలైన సందర్భంలోనే. అప్పుడు వీరు ఈ మహాద్భుతాన్ని చూడటానికే ఇంకా బ్రతికి ఉన్నానేమో అని వేదాంత ధోరణిలో వారి అభిప్రాయమును వివరించారు. తనకు వరాలైన గొంతు, ఉచ్చారణ అనారోగ్య కారణంగా దెబ్బతిన్న తరువాత 10 సంవత్సరములు చిత్రసీమకు దూరంగా ఉన్నారు.

బాబావారి మాటకి కట్టుబడి ధరించారు:

అనారోగ్య కారణంగా నోటిమాట పడిపోయింది. ‘‘అద్భుతంగా సంభాషణలు చెప్పి మెప్పించిన మీకు ఏమిటి ఈ దుర్దశ ?’’ అని మిత్రులు, అభిమానులు ఎంతో బాధపడ్డారు. తను వేసిన వేషాలకి ఎవరో డబ్బింగ్‌ చెప్పడం చూసి, నటించడం మానేశారు.

అయితే, పుట్టపర్తి సాయిబాబాతో వచ్చిన వీడియో సినిమాలో ఆయనకి చిన్నప్పటి బాబాకి, తాతగారుగా నటించే అవకాశం వచ్చింది. వెయ్యలేనని ఆయన తిరస్కరించినా, బాబావారి మాటకి కట్టుబడి ధరించారు.

‘‘నేను నీ ఆరోగ్యం చూసుకుంటాను’’ అని ఆయన చెప్పిన మాటకి స్పష్టత ఇచ్చారు. తను ధరించిన తాత పాత్రకి తానే డబ్బింగ్‌ చెప్పారు గుమ్మడి. అయినా, ఆ తర్వాత చిత్రాలు అంగీకరించలేదు. విశ్రాంతి తీసుకునేవారు, మిత్రులతో గడుపుతూ….

ఇంతటి ఘనకీర్తిని సంపాదించుకొన్న మహానటుడు శ్రీ గుమ్మడి 26 జనవరి 2010 న స్వర్గస్తులైనారు.

తీపిగుర్తులు:

గుమ్మడి గారికి ఎప్పుడూ చేతిలో సిగరెట్టు ఉండవలసిందే. అవి రామారావు గారు సీతారామకళ్యాణం సినిమాను తీస్తున్న రోజులు. దానికి దర్శకుడు కూడా రామారావు గారే. ఆ సినిమాలో గుమ్మడి గారిది విశ్వామిత్రుడి వేషం. గడ్డం. మీసాలు, చేతిలోదండం, కమండలాలతో అచ్చం విశ్వామిత్రుడు లాగానే ఉన్నారు. విరామం మధ్యలో సిగరెట్టు తాగాలనిపించింది. ఆ వేషం సిగరెట్టు పెట్టె , అగ్గిపెట్టె పెట్టుకోవటానికి అనుకూలంగా లేదు. అదీగాక, ఆ వేషంలో సిగరెట్టు తాగితే రామారావు గారు ఒప్పుకోరు. అప్పుడు గుమ్మడి గారు ఏమి చేసారో తెలుసా ? తన సహాయకుడి చేత సిగరెట్టు పెట్టె, అగ్గిపెట్టెను తెప్పించుకొని, వాటిని కమండలంలో పెట్టుకొని, toilet కు వెళ్ళినప్పుడల్లా గబగబా రెండు దమ్ములు పీల్చి వచ్చేవారు. ఆ సినిమాలో మొత్తం ఆయన కమండలంలో మంత్రజలానికి బదులుగా సిగరెట్టుపెట్టె, అగ్గిపెట్టె ఉన్నాయి.

పోతన పాత్ర ధరించారాయన. 1966న అంతకు ముందు ఎప్పుడో నాగయ్య నటించిన ‘పోతన’ విజయమై గాఢమైన ముద్రవేసింది. గుమ్మడి నటించిన ‘పోతన’ పరాజయం పాలైంది. అప్పుడు ఆత్రేయ చమత్కరించారు ఆ సినిమా ‘‘పోతానా?’’ అంటోందని. ఆ సినిమా విషయంలో తనమీదే తనే చమత్కారం చేసుకున్నారు గుమ్మడి. ‘‘నాగయ్య ‘పోతన’ చూసి, ముమ్మిడివరంలోని బాలుడు బాలయోగిగా మారాడు. గుడిలోనే వుండిపోయాడు. ఆయన బయటికి రావాలంటే, నేను నటించిన పోతన చూపించండి’’

గుమ్మడి పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల వేషాలు ధరించినా సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచి పోయాడు…