Avocado Cultivation | రంగారెడ్డి జిల్లాలో ‘అవ‌కాడో’ సాగు.. ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..!

Avocado Farming | ఆయ‌న సివిల్ ఇంజినీరింగ్( Civil Engineering ) ప‌ట్ట‌భ‌ద్రుడు.. అంతేకాదు లండ‌న్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ( MBA ) కూడా చేశాడు. లండ‌న్‌( London )లోనే కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అది న‌చ్చ‌క హైద‌రాబాద్‌( Hyderabad )కు వ‌చ్చి ఓ ఏడాది పాటు జాబ్ చేశాడు. అది కూడా న‌చ్చ‌క సొంతూరికి వెళ్లి.. అవ‌కాడో సాగు( Avocado Cultivation ) చేస్తూ ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు తెలంగాణ( Telangana ) యువ‌కుడు జైపాల్ నాయ‌క్( Jaipal Naik ).

Avocado Cultivation | జైపాల్ నాయ‌క్( Jaipal Naik ).. 2008లో సివిల్ ఇంజినీరింగ్( Civil Engineering ) ప‌ట్టా పుచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత లండ‌న్ వెళ్లి..ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ( MBA ) చ‌దివాడు. లండ‌న్‌( Ondon )లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ డిపార్ట్‌మెంట్‌లో కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాడు. కానీ ఆ ఉద్యోగం అత‌నికి సంతృప్తినివ్వ‌లేదు. 2012 నాటికి ఆయ‌న సొంతూరికి తిరిగొచ్చి… హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ఓ ప్ర‌ముఖ రిటైల్ కంపెనీలో చేరాడు. ఇక ఉద‌యం 9 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఉద్యోగం. ఈ జాబ్ కూడా జైపాల్‌కు సంతృప్తినివ్వ‌లేదు. హైద‌రాబాద్‌కు 45 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న త‌న ఊరు దెబ్బ‌డ‌గూడ‌( Debbadaguda )(మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం) నిత్యం గుర్తుకు వ‌చ్చేది ఆయ‌న‌కు. ఏడాది త‌ర్వాత‌.. ఉద్యోగాన్ని వ‌దిలేశాడు. వారిది వ్య‌వ‌సాయ కుటుంబం కావ‌డంతో.. ఆ ప‌నుల్లో నిమ‌గ్నం కావాల‌ని జైపాల్ నాయ‌క్ నిర్ణ‌యించుకున్నాడు.

అవ‌కాడో సాగుపై దృష్టి( Avocado Cultivation )  

త‌న గ్రామం దెబ్బ‌డ‌గూడ‌లో అంద‌రి రైతుల మాదిరిగానే జైపాల్ నాయ‌క్ కుటుంబం కూడా రసాయ‌నాల‌ను ఉప‌యోగించి మొక్క‌జొన్న‌, జొన్న‌, కందుల‌తో పాటు కూర‌గాయ‌ల‌ను పండించేవారు. దిగుబ‌డి త‌క్కువ‌గానే ఉండేది. ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఈ క్ర‌మంలో పండ్ల సాగు వైపు జైపాల్ దృష్టి సారించాడు. కానీ ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు అత‌ని మెడ‌దులో మెదిలేవి. మామిడి రైతులు కూడా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. నారింజ సాగు వ‌ల్ల పెద్ద‌గా లాభాల్లేవు.. జామ సాగులో కూడా రైతులు న‌ష్టాలు చవిచూస్తున్నారు.. మ‌రి కొత్త‌గా ఏ పండ్ల సాగు చేప‌ట్టాల‌ని కొద్ది రోజులు జైపాల్ మ‌ద‌న‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలోనే స్థానికంగా త‌క్కువ‌గా పండించే పండ్ల‌ను సాగు చేయాలనే ఆలోచ‌న త‌ట్టింది. దిగుబ‌డితో పాటు లాభాలు కూడా భారీగా పొందే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించాడు జైపాల్. దాంతో అవ‌కాడో సాగు( Avocado Cultivation ) చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

తొలి పంట వైఫ‌ల్యం

22013లో ఇజ్రాయెల్ నుంచి హాస్ అవ‌కాడో ర‌కానికి చెందిన 200 మొక్క‌ల‌ను దిగుమ‌తి చేసుకున్నాడు. ఒక్కో మొక్క ధ‌ర రూ. 1200. అయితే ఈ మొక్క‌ల పెరుగుద‌ల‌కు 30 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త ఉండాలి. కానీ తెలంగాణ‌లో అంత‌కు పైగానే ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతాయి. దీంతో ఆ ర‌కం మొక్క‌లు స‌రిగా పెర‌గ‌లేదు. దాంతో న‌ష్టం చ‌విచూశాడు జైపాల్. ఇక అవ‌కాడో సాగు వ‌ద్ద‌నుకున్నాడు. దీంతో త‌ను చ‌దువుకున్న సివిల్ ఇంజినీరింగ్‌లోనే సెటిల్ కావాల‌నుకున్నాడు. కాంట్రాక్ట్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యాడు. కానీ కొవిడ్ దెబ్బ‌కు ఆ రంగం కూడా కుదేలైంది.

మ‌ళ్లీ అవ‌కాడో సాగే ఎంపిక‌

కొవిడ్ త‌ర్వాత ప్ర‌జ‌ల్లో ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ పెరిగింది. దీంతో మ‌ళ్లీ అవ‌కాడో సాగుపైనే దృష్టి సారించాడు. అయితే గ‌త అనుభవాల‌ను దృష్టిలో ఉంచుకున్న జైపాల్.. స్థానికంగా న‌మోద‌య్యే ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌ట్టుకునే అవ‌కాడో ర‌కాల‌ను ఎంచుకోవాల‌నుకున్నాడు. మొత్తానికి 2020లో వెస్టిండినా ర‌కానికి చెందిన‌ 430 అవ‌కాడో మొక్క‌ల‌ను నాటారు. ఈ మొక్క‌లు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల‌ను త‌ట్టుకోగ‌ల‌వు. ఒక్కో మొక్క ధ‌ర రూ. 370.

కువైట్‌కు ఎగుమ‌తి..

2020లో మొక్క‌లు నాటగా, 2023లో పండ్లు పండాయి. ప్ర‌తి చెట్టు కూడా 5 నుంచి 10 కిలోల దిగుబ‌డి ఇచ్చింది. తెలిసిన స్నేహితుడి ద్వారా ఆ పండ్ల‌ను కువైట్‌కు ఎగుమ‌తి చేశాడు జైపాల్. అయితే ఓ ప్ర‌మాదం కార‌ణంగా.. ఆ త‌ర్వాత వాటిని ఎగుమ‌తి చేయ‌లేక‌పోయాడు. దీంతో దేశంలోనే కిలో అవ‌కాడోను రూ. 250కు విక్ర‌యించ‌డం మొద‌లుపెట్టాడు. డిమాండ్ కూడా భారీగానే ఉంది.

ఏడాదికి రూ. 8 ల‌క్ష‌ల సంపాద‌న‌

ఆరో ఏట‌లోకి ప్ర‌వేశించిన ఆ చెట్లు.. ఒక్కో చెట్టు నుంచి సుమారు 20 కిలోల వ‌ర‌కు దిగుబ‌డి ఉంది. 1.2 ఎక‌రాల్లోని 250 చెట్లతో ఏడాదికి సుమారు రూ. 8 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు జైపాల్. కేవ‌లం సేంద్రీయ ప‌ద్ధ‌తుల్లోనే సాగు చేస్తుండ‌డంతో ఈ అవ‌కాడో పండ్ల‌కు మార్కెట్‌లో కూడా భారీగానే డిమాండ్ ఉంది. దిగుబ‌డి కూడా ఎక్కువే.

వాట్సాప్ గ్రూపు వేదిక‌గా అమ్మ‌కాలు

జైపాల్ త‌న పొలంలో పండించిన అవ‌కాడోను ఏ మార్కెట్‌కు కూడా త‌ర‌లించ‌డు. వ్యాపారుల‌కు విక్ర‌యించాడు. త‌న‌కున్న క‌స్ట‌మ‌ర్ల‌కు కోత‌కు 15 రోజుల ముందే వాట్సాప్ గ్రూపులో స‌మాచారం అందిస్తాడు. దీంతో వినియోగ‌దారులు నేరుగా తోట వ‌ద్ద‌కే వ‌చ్చి అవ‌కాడోను కొనుగోలు చేస్తుంటారు.

న‌ర్స‌రీ వ్యాపారం.. రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు అద‌న‌పు ఆదాయం

అవ‌కాడో పండ్ల విక్ర‌యంతో పాటు న‌ర్స‌రీ ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాడు జైపాల్. ఒక్కో అవ‌కాడో మొక్క‌ను రూ. 300 నుంచి రూ. 400 వ‌ర‌కు విక్ర‌యిస్తున్నాడు. ప్ర‌తి ఏడాది 5 వేల నుంచి 10 వేల వ‌ర‌కు మొక్క‌ల‌ను అమ్ముతున్నాడు. దీంతో అద‌నంగా రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం స‌మ‌కూరుతుంది. మొత్తంగా అవ‌కాడో పండ్ల ద్వారా రూ. 8 ల‌క్ష‌లు, మొక్క‌ల అమ్మ‌కాల ద్వారా రూ. 5 ల‌క్ష‌లు సంపాదిస్తూ.. ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు జైపాల్ నాయ‌క్.

Latest News