ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు
ఇండియా కూటమి ప్రధాని ఎవరు…?
అమరావతి..పొలవరం పూర్తికే పొత్తు
కేంధ్ద హోంశాఖ మంత్రి అమిత్ షా
విధాత, హైదరాబాద్ : ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ ఏపీని అభివృద్ధి చేయకుండా భ్రష్టు పట్టించారని.. ఏపీ ప్రజలపై 13 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు.. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగస్.. మద్యం సిండికేట్ లు ఏర్పాటు చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సీఎం జగన్ ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి.. రాయలసీమ ప్రాజెక్టులు గాలికి వదిలేశారన్నారు.
ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారన్నారు. ఏపీని చంద్రబాబు తన పాలనలో ప్రథమ స్థానంలో నిలిపారని, విభజన తర్వాత కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్లారన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని జగన్ ఆదోగతి పట్టించారని అమిత్ షా విమర్శించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును ముఖ్యమంత్రిని.. కేంద్రంలో ప్రధాన మోదీని ప్రధానమంత్రి చేయండని పిలుపునిచ్చారు. మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనేనని, దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులను, నక్సలైట్లను అరికట్టేందుకు ఆయన్ను మళ్లీ ప్రధానిని చేయాలని కోరారు. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లతో చంద్రబాబును సీఎంను చేయాలి” అని అమిత్ షా పిలుపునిచ్చారు.
అమరావతి..పొలవరం కోసమే కూటమి
అమరావతిని రాజధానిగా చేసేందుకు, రాష్ట్రంలో గుండాగిరి, అవినీతి భూమాఫియాకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కూటమిగా పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడతామని, తెలుగు భాషను రక్షిస్తామన్నారు. తెలుగు భాషను అంతమొందించేందుకే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారని అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను ఎవరు ఏమి చేయలేరని స్పష్టం చేశారు. పోలవరం ఏపీకి జీవనాడి అని, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
నాకు అత్యంత సన్నిహితుడు సత్యకుమార్ ను ధర్మవరంలో గెలిపించాలని కోరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోదీ చూసుకుంటారని హామీ ఇచ్చారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, రాహుల్ గాంధీకీ ఆహ్వానం పంపినా రాలేదని దుయ్యబట్టారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు? అని నిలదీశారు.. శరత్ పవర్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దవ్ థాక్రే.. రాహుల్ గాంధీలో ఎవరు ప్రధాని అవుతారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.