ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు.
మెగా డీఎస్సీపై సీఎం తొలి సంతకం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం
పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం
అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం
స్కిల్ సెన్సస్పై ఐదో సంతకం చేసిన చంద్రబాబు
విధాత : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో కేటగిరిల వారీగా ఎస్జీటీ 6,371, పీఈటీ, 132, స్కూల్ అసిస్టెంట్స్ 7725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 పోస్టులు భర్తీ కానున్నాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసే ఫైల్పై సీఎం చంద్రబాబు రెండో సంతకం చేశారు. సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంపు దస్త్రంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు. అంతకుముందు బాధ్యతలు స్వీకరణకు సచివాలయంకు వచ్చిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ప్రభృతులతో పాటు వివిధశాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. అమరావతి రైతులు దారి పొడవునా పూల వర్షం కురిపించి క్రేన్ సహాయంతో భారీ గజమాల సత్కరించి ఘన స్వాగతం పలికారు.