విధాత: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని’’ సీఎం లేఖలో పేర్కొన్నారు.
‘‘శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది. ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్కు కూడా సీఎం జగన్ లేఖ రాశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. సీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ను జూన్ 30న సీడబ్ల్యూసీకి అప్లోడ్ చేశామన్నారు. ఈ పథకానికి భూసేకరణ చేయడం లేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకులు లేవన్నారు.