మద్యం స్కాంపై సీఐడీ విచారణ
ఈడీ విచారణకూ సిఫారసు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
మద్యంపై అసెంబ్లీలో శ్వేత పత్రం
విడుదల చేసిన సీఎం చంద్రబాబు
18 వేల కోట్ల నష్టం : డిప్యూటీ సీఎం పవన్
30వేల కోట్ల స్కాం : బీజేపీ నేత విష్ణు
సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్
విధాత, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అమ్మకాలలో అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లోతైన విచారణకు ఈడీ విచారణకు కూడా సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయి. నేరస్థుడే రాజకీయ నేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లలో చూశాం. మేం విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుంది’ అని అన్నారు. గత ప్రభుత్వం మద్యపాన నిషేధం, లిక్కర్ ఔట్లెట్ల తగ్గింపు అని చెప్పి అన్నీ విస్మరించిందని విమర్శించారు. మద్యం ధరలు పెంచుకుంటూపోతే తాగేవాళ్ళు తగ్గుతారని చెప్పిన గత పాలకులు పొరుగురాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారని, 75 శాతం రేట్లు పెంచినా మద్యం వినియోగం అమాంతం పెరిగిపోయిందని లెక్కలతో సహా వివరించారు. అమ్మకాలు పెరిగినా ఏపీలో ఆదాయం తగ్గిందన్న చంద్రబాబు.. పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ఏపీలో మద్యం కుంభకోణం భయంకరంగా సాగిందన్నారు. ‘దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదు. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారు. చెల్లింపులు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారు. లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చి షాపుల్లో విక్రయించారు’ అని చంద్రబాబు తెలిపారు. ఏమి అమ్మితే అవే తాగే పరిస్థితిని ప్రజలకు కల్పించారన్నారు. మద్యం అనేది ఒక వ్యసనమని, పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతారని, వారి అలవాటును బలహీనంగా చేసుకొని దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడి పెట్టించారని, దీంతో ఆయా శాఖలకు దాదాపు రూ.250 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. తప్పుచేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూడటంతోపాటు డీఅడిక్షన్ సెంటర్లనూ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఏ విధంగా ప్రక్షాళన చేయాలన్నదానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
18వేల కోట్ల నష్టం..దోషులను శిక్షించాలి : పవన్ కల్యాణ్
ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో ఖజానాకు 18వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తున్నదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిప్యూటీ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాజధానికి 15వేల కోట్లు ఇస్తే సంబరపడ్డామని చెబుతూ.. మద్యం కుంభకోణంలో నష్టపోయిన 18 వేల కోట్లు ఖజానాకు చేరితే రాజధాని పనులు, పోలవరం పనులు చాలవరకు పూర్తయ్యేవన్నారు.
30వేల కోట్ల కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం పెట్టిన శ్వేతపత్రం వాస్తవ దూరంగా ఉందని, అక్రమాల పాలైన మొత్తాన్ని తక్కువగా చూపారని, 99వేల కోట్ల అమ్మకాలు జరిగితే 3శాతం అక్రమాలు జరిగినట్లుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్టిన శ్వేత పత్రం చూస్తే మాజీ సీఎం జగన్ సంబరపడుతారన్నారు. శ్వేత పత్రంలో చెప్పినదానికంటే అధికంగా 30 వేలకోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.