ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్.జగన్ ఓడిపోతున్నాడని, ఓడిపోతే తన అరెస్టు తప్పదని గ్రహించి విదేశాలకు పారిపోవటానికి పాస్ పోర్టులు కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితిలో ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్.షర్మిల ఆరోపించారు
విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు
వ్యతిరేకులను నరికితే సింగిల్ ప్లేయర్ ఉంటారు
వైఎస్ భారతి వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపాటు
విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్.జగన్ ఓడిపోతున్నాడని, ఓడిపోతే తన అరెస్టు తప్పదని గ్రహించి విదేశాలకు పారిపోవటానికి పాస్ పోర్టులు కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితిలో ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్, కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్.షర్మిల ఆరోపించారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ వైఎస్. భారతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను గొడ్డలితో నరకాలి..వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి ఇదేనా భారతి స్ట్రాటజీ అని షర్మిల ప్రశ్నించారు. గొడ్డలితో మిగతా వాళ్లందరిని నరికేయండి..అప్పుడు మీరు సింగిల్ ప్లేయర్ గా ఉంటారని ఎద్దేవా చేశారు.
కడపలో అవినాష్ ఓడిపోతాడని తెలిసి, అరెస్టు ఖాయమని గ్రహించి ఊరు దాటి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, దొంగ పాస్ పోర్టులు కూడా తయారు చేసుకున్నారని ఆరోపించారు. కడపలో అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లని, వైఎస్ షర్మిలా గెలిస్తే నిజం గెలిచినట్లని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీని కలవాలంటే ఇంటికి వచ్చే వాళ్ళు కావాలా ? జైలుకి వెళ్లి కలిసే వాళ్ళు కావాలా కడప ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఓడిపోయాక దేశం వదిలి వెళ్ళిపోవడానికి జగన్ సన్నాహాలు చేసుకుంటున్నారని, అందుకే చివరి నిమిషంలో కూడా ఎన్నికల ప్రచారం నుండి వరుస విరామాలు తీసుకుంటున్నాడని, ఎన్నికలు అవ్వగానే జగన్ దంపతులు లండన్ వెళ్లనున్నారని, కేసుల నుండి తప్పించుకోవడానికి పర్మనెంట్ గా అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకున్నారని షర్మిల ఆరోపించారు.