రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రోజురోజుకూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని… ఓవైపు విపరీతమైన ఎండలు, లేదంటే తుఫానులు వస్తున్నాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు దీనికి హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏయూ గ్రౌండ్లో ముఖ్యమంత్రి మొక్క నాటారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా నిలవాలి
తిరుమల తరహాలో ఏయూ క్యాంపస్లోనూ గ్రీనరీ పెరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం క్యాంపస్లో 25 శాతమే గ్రీనరీ ఉందని… దీనిని 50 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఏయూ వీసీని సీఎం ఆదేశించారు. ‘స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణానికి ఏయూ క్యాంపస్ ఆదర్శంగా మారాలి. నెట్ జీరో క్యాంపస్గా ఏయూను నిలపాలి. ఆంధ్ర యూనివర్శిటీకి 450 ఎకరాల సువిశాల క్యాంపస్ ఉంది. ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచడంతో పాటు… బిల్డింగుల మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాంపస్కు అవసరమైన విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. ఇప్పటికే రూ.5,18,000 విలువైన విద్యుత్ ఆదా అయింది. క్యాంపస్ ను బయో డైవర్శిటీ పార్కుగా తీర్చిదిద్దాలి.
హాస్టళ్లు, కాలేజీల నుంచి వచ్చే చెత్త, చెట్ల ఆకులను కంపోస్ట్గా మార్చాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, వ్యర్ధాల నుంచి బయో గ్యాస్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలి. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలి. క్యాంపస్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు వెళ్లకూడదు. శుద్ధి చేసిన నీటిని చెట్లకు ఉపయోగించాలి. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ వంటలకు వినియోగించుకోవాలి. నెట్ జీరో విధానం అమలు చేయడానికి ప్రొఫెసర్స్ టీం ఏర్పాటు చేయాలి. పర్యావరణానికి సంబంధించి విద్యార్థులకు ఏయూ క్యాంపస్ ఓ నాలెడ్జ్ హబ్గా తయారవ్వాలి. ప్రపంచంలోని టాప్ నాలెడ్జ్ వర్సిటీల సరసన ఏయూను నిలపాలి. క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురావాలి.’ అన్నారు.
విశాఖలో కాలుష్య నియంత్రణ చర్యలు
విశాఖలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పోర్టు దగ్గర నుంచి మొదలుకుని అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లంటూ సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్తో గ్రీనరీ పెంచేలా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. సైక్లింగ్ ద్వారా రెండు విధాలుగా లాభం ఉందని… కాలుష్యం తగ్గడమే కాకుండా ఫిట్నెస్ పెంచుకోవచ్చని సీఎం అన్నారు.
ఆకట్టుకున్న సీఎం చంద్రబాబు సైక్లింగ్
ఏయూ యూనివర్సిటీలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు స్వయంగా విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఎర్రటి ఎండ కాస్తున్నా.. 76 సంవత్సరాల కుర్రోడిలా సీఎం ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ నుంచి 3 టౌన్ పీఎస్ జంక్షన్, పోలమాంబ గుడి, వుడా పార్క్, వైఎంసీఏ, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్కు సైకిల్పై వెళ్లారు. మొత్తం ఐదున్నర కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లోనే చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సైక్లింగ్ ఏదో ఫోటోల కోసం కాదు అని, ప్రజలకు ఇదో జీవన అలవాటుగా మారాలని చంద్రబాబు సూచించారు. సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి అని, విశాఖలో వాకింగ్, సైక్లింగ్కి ప్రత్యేక ట్రాక్లు తీసుకొస్తాం అని ప్రకటించారు.
76-year old CM Chandrababu Naidu Enthusiastically Cycled nearly 6-km in #Visakhapatnam
TDP launches a State-wide bicycle campaign for #WorldEnvironmentDay ; #AndhraPradesh Chief Minister #ChandrababuNaidu rides a bicycle (#CycleRally) on Beach Road in Visakhapatnam (#Vizag) on… pic.twitter.com/j9CWdAxxFO
— Surya Reddy (@jsuryareddy) June 5, 2026