ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని..మీ భూమిపై జలగ జగన్ పెత్తనమేంటని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. శుక్రవారం ఉండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు
విధాత: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని..మీ భూమిపై జలగ జగన్ పెత్తనమేంటని టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. శుక్రవారం ఉండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫొటో ఎందుకని, దీనికి మీరు అంగీకరిస్తారా? ఆమోదయోగ్యమేనా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలిస్తామన్నారు.
ఈ ఎన్నికల్లో ఫ్యానుకు, వైసీపీకి ఉరేయాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయని జగన్కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు తాను ఇసుకను ఉచితంగా ఇచ్చానని, జగన్ ఇసుక, మట్టి, ఆస్తులు కొట్టేసి మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని కోరారు.
రాష్ట్ర భవిష్యత్తు మార్చుకునేందుకు ఇంకా 3 రోజులే ఉందని, అత్యధిక మెజార్టీతో కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజల జీవితాలు మారాలన్నా, రైతులకు సాగు నీరు అందాలన్నా గిట్టుబాటు ధర రావాలన్నా, పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా, రాష్ట్రం నుంచి జె బ్రాండ్లు పూర్తిగా పోవాలన్నా, కరెంట్ చార్జీల మోత తప్పాలన్నా అందరూ ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పోలింగ్ రోజున మీరు వేసే ఓట్లతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలవ్వాలని, గెలుపే ధ్యేయంగా కూటమి కార్యకర్తలు పని చేయాలని, సైకోను సాగనంపడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.