ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కనుంది.
జనసేనకు డిప్యూటీ స్పీకర్
విధాత, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ పదవి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి దక్కనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యన్న పేరును ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనున్నారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు లోకం మాధవి, పంతం నానాజీ రేసులో ఉన్నారు. అదేవిధంగా చీఫ్ విప్గా సీనియర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ను నియమించనున్నారని సమాచారం.
అయ్యన్నపాత్రులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24,676 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచీ టీడీపీలో కొనసాగుతున్న ఆయన ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19న ప్రారభం కానున్నాయి. అదే రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను సభ ఎన్నుకోనుంది.