ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రానికి ఆర్ధిక సహాయంపై అభ్యర్థన
బడ్జెట్ల నిధుల కేటాయింపులకు కేంద్ర మంత్రులకు వినతి
విధాత : ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి రాష్ట్రానికి ఆర్ధిక సహాయం, రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారం కోరారు. వైసీపీ ఐదేళ్ల పాలన నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాన మంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్ధిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో పాటు, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై విజ్ఞప్తులు చేశారు.
ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితీన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలోని పెండింగ్ రహదారుల పూర్తి, కొత్త రహదారుల మంజూరీపై చర్చించారు. అనంతరం అమిత్షా, నిర్మలా సీతారామన్ సహా మరికొందరు మంత్రులనలు కలిసి రాష్ట్ర సమస్యలపై వినతులు సమర్పించారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కె. రాంమోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు చంద్రబాబు వెంట ఉన్నారు.