అధికారం కోసం సాధ్యంకాని హామీలను చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు
మీ బిడ్డ పాలనతోనే సంక్షేమం కొనసాగింపు
విధాత: అధికారం కోసం సాధ్యంకాని హామీలను చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు గ్రామంలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. 2014లో కూటమి తరుఫున చంద్రబాబు ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు.
రైతు రుణ మాఫీపై తొలి సంతకం, పొదుపు సంఘాల రుణాల వడ్డీ మాఫీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు, ఇంటికో ఉద్యోగం, ప్రతినెల నిరుద్యోగ భృతి అన్నారని, వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. అర్హులైన వారందరికీ మూడు సెంట్ల భూమి ఇవ్వలేదని ఆరోపించారు. 14 ఏండ్ల చంద్రబాబు పాలనలో ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసింది లేదని, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకం గుర్తుకురాదని దుయ్యబట్టారు. మీ బిడ్డ జగన్ 59 నెలల పాలనలో మ్యానిఫెస్టోను పవిత్రగ్రంథంగా భావించి 99శాతం హామీలను అమలు చేశామని పేర్కొన్నారు.
ఏనాడు లేనివిధంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 93 శాతం విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ను కడుతున్నామన్నారు. రెండున్నర లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఇంటి వద్దకే రేషన్, పింఛన్ల పంపిణీ, పౌరసేవలు అందిస్తున్నామని తెలిపారు. లంచాలు లేని వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తు చేశారు. మీ బిడ్డ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మీ బిడ్డ పాలన మళ్లీ రావాలంటే వైసీపీని గెలిపించాలని కోరారు.