వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది!

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట మొదలైంది. రాయలసీమలో 2 రోజులుగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాల కోసం వివిధ ప్రాంతాల ప్రజలు అక్కడి పొలాలకు తరలి వెళ్తున్నారు.

వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది!

అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట మొదలైంది. రాయలసీమలో 2 రోజులుగా తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రాల కోసం వివిధ ప్రాంతాల ప్రజలు అక్కడి పొలాలకు తరలి వెళ్తున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ తలరాత మారుతుందనే ఆశతో ఫుడ్ క్యారేజీలతో సహా వచ్చి పొలాలను జల్లెడ పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం (ముఖ్యంగా వజ్రకరూరు), కర్నూలు (తుగ్గలి, జొన్నగిరి) మరియు కృష్ణా నది తీర ప్రాంతాలలో వర్షాలు పడినప్పుడు వజ్రాల వేట మొదలవుతుంది. తొలికరి వర్షాలకు నేలపైన పడిన వర్షపు నీటికి మట్టి కొట్టుకుపోయి వజ్రాలు మెరుస్తూ బయటపడతాయని స్థానికుల నమ్మకం. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, పాలకుర్తి, గుత్తి, కర్నూలు జిల్లాలోని తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర పరిసరాల్లోని వ్యవసాయ పొలాల్లో ఈ వేట ఎక్కువగా సాగుతుంది.ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘కోహినూర్‌’ వజ్రం కూడా కృష్ణా నది తీరంలోనే దొరికిందని చరిత్ర చెబుతోంది.

ప్రజలు వానలు పడగానే ఇక్కడి పొలాల్లో వజ్రాల అన్వేషణ చేస్తూ..తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఏటా కొంత మందికి లక్షల విలువైన వజ్రాలు దొరుకుతుండటంతో తమకు కూడా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో దొరక్క పోదా? అన్న ఆశలతో చిన్నా, పెద్ద అంతా వజ్రాల వేట కొనసాగించడం పనిగా పెట్టుకుంటున్నారు. అదృష్టం బాగుండి వజ్రం దొరికితే తమ జీవితం మారిపోతుందన్న ఆశ వారిని వజ్రాల అన్వేషణకు పురిగొల్పుతుంది.