ఆత్మహత్య యత్నం చేసిన యువతికి అండగా ‘దిశ’ పోలీస్ స్టేషన్

విధాత,కడప: తీవ్ర మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన యువతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రిక అయిన 'దిశ' పోలీస్ స్టేషన్ అండగా నిలిచింది. వివరాల్లోకెళితే.. తాడిపత్రికి చెందిన రబ్బు అనూష (25) తల్లిదండ్రులను ఎదిరించి ఇంటర్మీడియట్ చదివే సమయంలో ప్రేమవివాహం చేసుకుంది. కొన్నాళ్ళు సజావుగా సంసారం సాగిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. భర్త హరిబాబు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు […]

  • Publish Date - July 22, 2021 / 02:42 PM IST

విధాత,కడప: తీవ్ర మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన యువతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రిక అయిన ‘దిశ’ పోలీస్ స్టేషన్ అండగా నిలిచింది. వివరాల్లోకెళితే.. తాడిపత్రికి చెందిన రబ్బు అనూష (25) తల్లిదండ్రులను ఎదిరించి ఇంటర్మీడియట్ చదివే సమయంలో ప్రేమవివాహం చేసుకుంది. కొన్నాళ్ళు సజావుగా సంసారం సాగిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. భర్త హరిబాబు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తుండడంతో తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను భర్త తో కలిసి ఉండనని, తల్లిదండ్రుల వద్దకు వెళతానని పోలీసులకు చెప్పింది. అయితే తమను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అనూషను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఓ వైపు తన 8 ఏళ్ల కుమారుడిని భర్త తనకు దూరం చేసి తనవద్దే ఉంచుకోవడం, మరోవైపు తల్లిదండ్రుల నిరాకరణ కలగలిసి తీవ్ర మనోవేదనకు గురయిన అనూష ఆత్మహత్యే శరణ్యమని భావించి సిద్దవటం వద్ద ఉన్న పెన్నా నదిలో దూకేందుకు ప్రయత్నించే నేపథ్యంలో స్థానికులు అడ్డుకుని కడప నగరంలోని ‘దిశ’ పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ‘దిశ’ డి.ఎస్.పి కె.రవి కుమార్ ఆధ్వర్యంలో మానసిక నిపుణులతో యువతికి కౌన్సిలింగ్ నిర్వహించి మనోధైర్యం కల్పించారు. పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం యువతిని వన్ స్టాప్ సెంటర్ కు తరలించారు. తనకు మనోధైర్యాన్నిచ్చి భరోసా కల్పించి అండగా నిలిచిన ‘దిశ’ పోలీస్ స్టేషన్ కు, జిల్లా ఎస్.పి శ్రీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ యువతి కృతజ్ఞతలు తెలియచేసింది.