Cyclone Montha Disrupts Travel | మొంథా ఎఫెక్ట్‌.. 107 రైళ్లు..18 విమానాలు రద్దు

మొంథా తుపాన్ ప్రభావంతో రైల్వే, విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఏపీలో మొత్తం 107 రైళ్లు, 18 విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Oct 28, 2025, 1:45 pm IST
Read Time: 2 mins
Cyclone Montha Disrupts Travel | మొంథా ఎఫెక్ట్‌.. 107 రైళ్లు..18 విమానాలు రద్దు

అమరావతి : మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే, విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు మార్గాల్లో రైళ్లను, విమాన సర్వీసులను రద్దు చేస్తు నిర్ణయం తీసుకున్నాయి.

రైల్వే శాఖ కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది. మంగళ, బుధవారాల్లో నడిచే 107 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇవాళ 70 రైళ్లు, రేపు 36 రైళ్లు, ఎల్లుండి ఒక రైలు రద్దు చేసినట్లు పేర్కొంది. రద్దయిన రైళ్లలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు మీదుగా నడిచే పలు రైళ్లు ఉన్నాయి.

ఏపీకి వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు

మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు విమాయన శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్‌ రావాల్సిన విమానాలను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.