Vizag Google | విశాఖలో గూగుల్ పెట్టుబడి –  ఆంధ్రా–కర్ణాటక మధ్య “ట్వీట్ల యుద్ధం”

విశాఖలో గూగుల్‌15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిపై ఆంధ్రా–కర్ణాటక వాగ్వాదం. నారా లోకేశ్ వ్యంగ్య వ్యాఖ్యలు, ఖర్గే–శివకుమార్ స్పందనలు. పెట్టుబడుల పోటీ దక్షిణ భారత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు.

Vizag Google | విశాఖలో గూగుల్ పెట్టుబడి –  ఆంధ్రా–కర్ణాటక మధ్య “ట్వీట్ల యుద్ధం”

After $15 Billion Google ‘Win’, Nara Lokesh takes dig at Karnataka in investment row

న్యూఢిల్లీ:
గూగుల్‌ ఆంధ్రప్రదేశ్‌లో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో, ఆంధ్రప్రదేశ్‌ మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోరు మరింత వేడెక్కింది.
ఈ నేపధ్యంలో ఆంధ్రా మంత్రి నారా లోకేశ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖార్గే మధ్య సోషల్‌ మీడియా వేదికపై మాటల యుద్ధం కొనసాగుతోంది.

“మా పెట్టుబడులు కూడా స్పైసీ” :  లోకేశ్ వెట‘కారం’

“ఆంధ్రా వంటకాలు మంటలు పుట్టిస్తాయని అంటారు… ఇప్పుడు మా కొచ్చిన పెట్టుబడులు కూడా అలానే ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలకు ఇప్పుడే మంటలు పట్టిస్తున్నాయి,” అని నారా లోకేశ్  కర్ణాటకనుద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్‌ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపంపై వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి సమయంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక నేతల్లో ఆగ్రహం రేపాయి.

కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, “బెంగళూరులో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, స్టార్టప్‌లు, మానవ వనరులు, ఇన్నోవేషన్లు — ఇవన్నీ ఏ రాష్ట్రానికీ లేవు. ఆంధ్రా లాంటి రాష్ట్రాలు మాలాంటి రాష్ట్రాలను వాడుకుని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి,” అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా మాట్లాడుతూ, మాకు ఉన్న మౌలిక వసతులు, ప్రతిభ, సాంకేతిక సదుపాయాలను ఎవ్వరూ కాపీ చేయలేరు. వారు చేయాలనుకున్నా, మా స్థాయికి చేరుకోలేరని అన్నారు.

దీనిపై స్పందించిన లోకేశ్‌ —
“మేము ఇప్పటికే 120 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పొందాము. ఆంధ్రాలో సంస్కరణలు వేగంగా జరుగుతున్నాయి. దాంతో కొన్ని రాష్ట్రాలు అసహనంతో ఉన్నాయి. అది మా తప్పు కాదు, అది వారికే సవాలు,” అని NDTV తో చెప్పారు.

అయితే కర్ణాటక మంత్రి ఖార్గే ఆరోపిస్తూ —
“గూగుల్‌ను ఆకర్షించడానికి ఆంధ్రా రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు, యుటిలిటీ సబ్సిడీలు ఇచ్చింది,” అన్నారు. దీనిపై లోకేశ్‌ సమాధానమిస్తూ — “కర్ణాటక వైఫల్యాన్ని దాచేందుకు పదేపదే అవే కారణాలు చెబుతున్నారు. విద్యుత్​ కోతలు, చెత్త రోడ్లు, బలహీన మౌలిక వసతులు — ఇవే కర్ణాటక ప్రధాన సమస్యలు,” అని అన్నారు.

బెంగళూరుపై పెరుగుతున్న అసంతృప్తి

బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల ట్వీట్‌ చేస్తూ —
“చైనాకు చెందిన నా సహచరుడు బెంగళూరు రోడ్ల గురించి అడిగాడు. రోడ్లు ఇంత చెత్తగా ఎందుకు ఉన్నాయి? ప్రభుత్వానికి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశమేమైనా ఉందా? లేదా?” అని ప్రశ్నించారు.

ఆమె ట్వీట్‌ తర్వాత పౌరులు కూడా సీఎం సిద్దరామయ్యకు లేఖ రాస్తూ, రోడ్లు, గుంతలు సరిచేయకపోతే ఆస్తి పన్ను కూడా చెల్లించమని హెచ్చరించారు.

పెట్టుబడుల్లో పోటీకి కొత్త మలుపు

గూగుల్‌ పెట్టుబడితో ఆంధ్రా–కర్ణాటక పోటీ కొత్త మలుపు తిరిగింది. పరిశ్రమ నిపుణులు మాత్రం ఈ పోటీ దక్షిణ భారత ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు సాంకేతిక పరిశ్రమల్లో ఆధిపత్యం సాధించేందుకు కసరత్తు చేస్తున్నాయి.


💼 English Summary:

A political war of words broke out between Andhra Pradesh and Karnataka after Google announced a $15 billion data and AI hub in Andhra. IT Minister Nara Lokesh mocked Karnataka saying “Andhra’s investments are spicy,” amid growing criticism of Bengaluru’s infrastructure. DK Shivakumar and Priyank Kharge defended Karnataka, claiming Bengaluru remains unmatched in innovation. Lokesh countered that Andhra’s rapid reforms were driving investor confidence, urging Karnataka to fix its own infrastructure first.