విధాత, హైదరాబాద్ 😐 ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం వైసీపీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక పాలన సాగుతుందని, రాజకీయ హత్యలు, దాడులు, విధ్వంసాలు సాధారణమయ్యాయని జగన్‌ వివరించారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి పై రాళ్లతో దాడి , గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఈ సందర్భంగా గవర్నర్‌కు జగన్ వివరించారు. కూటమి పార్టీలకు చెందిన వారి దాడులకు సంబంధించిన ఆధారాలు, వీడియోలను గవర్నర్‌కు అందించారు.