కడప పోలీసుల చొరవతో స్వదేశానికి చేరుకున్న విదేశీ మహిళ
విధాత,కడప:ప్రియుడి కోసం ఖండాలు దాటి..ఎల్లలు దాటి ఇండియాకు వచ్చింది. అనుకోకుండా ప్రియుడు అనారోగ్యంతో మరణించడంతో దిక్కు..మొక్కూ లేకుండా ఉన్న సమయంలో జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ చొరవతో స్వదేశమైన ఇథియోపియాకు శుక్రవారం ఉదయం చేరుకుంది. వివరాల్లోకెళితే.. రాజంపేట కు చెందిన కామినేని నారాయణ కువైట్ లో డ్రైవర్ గా పనిచేసేవాడు. అక్కడే పనిచేస్తున్న ఇథియోపియాకు చెందిన యువతి ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే(33) పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో అక్టోబర్ 15 , 2015 సామ్. […]

విధాత,కడప:ప్రియుడి కోసం ఖండాలు దాటి..ఎల్లలు దాటి ఇండియాకు వచ్చింది. అనుకోకుండా ప్రియుడు అనారోగ్యంతో మరణించడంతో దిక్కు..మొక్కూ లేకుండా ఉన్న సమయంలో జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ చొరవతో స్వదేశమైన ఇథియోపియాకు శుక్రవారం ఉదయం చేరుకుంది. వివరాల్లోకెళితే.. రాజంపేట కు చెందిన కామినేని నారాయణ కువైట్ లో డ్రైవర్ గా పనిచేసేవాడు. అక్కడే పనిచేస్తున్న ఇథియోపియాకు చెందిన యువతి ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే(33) పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో అక్టోబర్ 15 , 2015 సామ్. లో ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే ను రాజంపేటకు తీసుకువచ్చి ఒక అద్దె ఇంటిలో ఉంచాడు. ఆర్ధిక సమస్యల కారణంగా కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని, మరో మారు కువైట్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అప్పటి నుండి నెల నెలా ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే కు డబ్బులు పంపించేవాడు. కాలక్రమంలో యువతి వీసా గడువు ముగిసినప్పటికీ ఎవ్వరిని కలవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండేది. గత ఏడాది ప్రియుడు కామినేని నారాయణ కువైట్ లో గుండె పోటు తో మరణించడంతో మరింత కృంగిపోయింది. ప్రియుడు నారాయణ మృతదేహాన్ని రాజంపేట కు పంపగా, గత ఏడాది మార్చి 6 న అంత్యక్రియలు పూర్తిచేశారు. విధి తనపై ఇంతగా పగ బట్టిందా..అనుకుంటూ తీవ్ర మానసిక వేదన అనుభవించింది. తినడానికి తిండి కూడా లేక, ఏమి చేయాలో తెలియక, ఆదరించే వారు లేక నరక యాతన అనుభవించింది. ఈ నేపథ్యంలో చుట్టుప్రక్కల వారి ద్వారా జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం లో ఉన్న ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్.ఆర్.ఒ) చేరుకొని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనను తన దేశం ఇథియోపియా కు పంపించాలని ప్రాధేయపడింది. తక్షణం స్పందించిన జిల్లా ఎస్.పి తగిన చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు.వెంకట కుమార్ కు అప్పగించారు. జిల్లా ఎస్.పి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ వెంకట కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.సుబ్బరాజు ఇథియోపియా దేశానికి చెందిన ఎంబసీ అధికారులతో సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ మరోవైపు యువతిని ప్రియుడు నారాయణ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచారు.
ఇదిలా ఉండగా అనుకోకుండా కొద్ది నెలల క్రిందట యువతికి కోవిడ్ సోకడంతో కష్టాలు మరింత అధికమయ్యాయి. యువతికి కోవిడ్ నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. జిల్లా ఎస్.పి అన్బురాజన్ కోవిడ్ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్ ను అందచేసి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందచేయడంతో కోవిడ్ నుండి కోలుకుంది. అనంతరం నిరంతరం పర్యవేక్షిస్తూ న్యూ ఢిల్లీ లోని ఎంబసీ
అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఎమర్జన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ (E.T.D) ద్వారా శుక్రవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్ట్ నుండి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా కు క్షేమంగా చేరుకుంది. ఎస్.పి ఆదేశాల మేరకు కడప నుండి ప్రత్యేక ఎస్కార్ట్ తో గురువారం రైలులో ముంబై కు బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున స్వదేశానికి చేరుకుంది.ముంబై ఎయిర్ పోర్ట్ కు వెళ్లేముందు ఎస్.పి అన్బురాజన్ని కలిసి యువతి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసింది. ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంది. మీరు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనని, జన్మ జన్మలకు జిల్లా పోలీసు శాఖకు రుణపడి ఉంటానని ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే పేర్కొంది. ధైర్యంగా ఉండాలని, స్వదేశానికి వెళ్లి మంచి జీవితాన్ని జీవించాలని ఎస్.పి ఆకాంక్షించారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం తన క్షేమ సమాచారాన్ని అన్బురాజన్ కి తెలిపి మరోసారి ధన్యవాదాలు తెలియచేసింది.