రూ.912 కోట్ల వ్యయ అంచనాతో పోలవరం ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందు జి.ఓ. జారీ చేసింది. నిన్న మంత్రి మండలి నిర్ణయం చేసింది. ఇదేనా! ప్రజాస్వామ్య పాలనా విధానం! పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయమని ప్రజలు కోరుతుంటే, మధ్యలో పోలవరం ఎత్తిపోతల పథకం ఎందుకు చేపడుతున్నట్లు? పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి డిపిఆర్-2కు ఆమోదం పొంది, నిథులు రాబట్టుకొనే శక్తిలేకనా? […]
రూ.912 కోట్ల వ్యయ అంచనాతో పోలవరం ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందు జి.ఓ. జారీ చేసింది. నిన్న మంత్రి మండలి నిర్ణయం చేసింది. ఇదేనా! ప్రజాస్వామ్య పాలనా విధానం!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయమని ప్రజలు కోరుతుంటే, మధ్యలో పోలవరం ఎత్తిపోతల పథకం ఎందుకు చేపడుతున్నట్లు?
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి డిపిఆర్-2కు ఆమోదం పొంది, నిథులు రాబట్టుకొనే శక్తిలేకనా? డిపిఆర్ -2కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన రు.55,548 కోట్ల వ్యయ అంచనాకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మోకాలడ్డింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని భరిస్తామని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకొన్నది. ఇప్పుడు డిపిఆర్-2 అంగీకరించకపోతే హక్కుగా పోరాడి సాధించుకొని, ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలన్న రాజకీయ సంకల్పం రాష్ట్ర ప్రభుత్వానికి కొరవడిందా?
ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుండి ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఎందుకు పూనుకొన్నారు?
పోలవరం జలాశయంలో “డెడ్ స్టోరేజ్” 32 మీటర్లు నుండి 35 మీటర్ల మధ్య లభించే నీటిని ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలోని కరవు పీడిత ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారట! ప్రాజెక్టు నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణాన్ని పూర్తి చేస్తారా! లేదా! అన్న అనుమానాలు ప్రజల్లో అందువల్లనే వస్తున్నాయి.
పోలవరం జలాశయాన్ని బచావత్ ట్రిబ్యునల్, కేంద్ర జల సంఘం, సుప్రీం కోర్టు ఆమోదించిన మేరకు 150 అడుగుల ఎత్తుతో నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం మేరకు 194.6 టియంసిలు నిల్వ చేస్తే గ్రావిటీ ద్వారానే కుడి కాలువ ద్వారా నీటిని సరఫరా చేయవచ్చు కదా!
పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తే మొత్తంగా 322 టియంసిలను వినియోగించుకొని, 7.20 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు 10.5 లక్షల ఎకరాల గోదావరి డెల్టా ఆయకట్టు స్ఠిరీకరణ, ప్రాజెక్టు కాలువల వ్యవస్థ విస్తరించే ప్రాంతాల్లో 540 గ్రామాల్లో, పలు పట్టణాల్లో నివసిస్తున్న 30 లక్షల జనాభాకు, విశాఖపట్నం మహానగరవాసులకు త్రాగునీరు, అలాగే విశాఖ ఉక్కు, తదితర పరిశ్రమలకు నీటి సరఫరా, 80 టీయంసీలను ప్రకాశం బ్యారేజీకి తరలించి 13.5 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు అవసరాలు తీర్చడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా నదీ జలాలను శ్రీశైలం జలాశయం నుండి రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించి, కరవుపీడిత ప్రజల దప్పిక తీర్చే లక్ష్యం కూడా ఇమిడి ఉన్నది కదా!
అప్పుల ఊబిలో కూరుక పోయిన రాష్ట్రంపై పోలవరం ఎత్తిపోతల భారాన్ని ఎందుకు మోపుతున్నారు?
టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
విజయవాడ Cell:9490952221
తేది:05-05-2021