సోమందేపల్లి, విధాత:వృద్ధురాలైన తల్లి వైద్య పరీక్షల కోసం కారులో బెంగళూరుకు వెళ్తుండగా.. మరో కారు రూపంలో వారిని దురదృష్టం వెంటాడింది. ఘోర రహదారి ప్రమాదం చోటుచేసుకొని, ఏకంగా ముగ్గురిని పొట్టన పెట్టుకొంది. కారు అతి వేగం కారణంగా రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి ఇన్ఛార్జి ఎస్సై రమేష్బాబు, స్థానిక ఏఎస్సై మురళీమోహన్ కథనం మేరకు వివరాలు.. అనంతపురం ఉమానగర్ కాలనీకి చెందిన షేకూన్బీకి షేక్ జాఫర్, బాషా, బాబా ఫక్రుద్దీన్ కుమారులు. బాషా ఎనిమిది నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందారు. అనంతపురం పాతూరులో బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తూ వీరి కుటుంబం జీవనం సాగిస్తోంది. షేకూన్బీ మధుమేహం, రక్తపోటుతో బాధపడుతుండగా జూన్లో బెంగళూరు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందారు.
మంగళవారం రాత్రి ఆమె ఆరోగ్యం కొంతమేర విషమించడంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు.
ఈనేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ఆమెను కుమారులు జాఫర్, బాబాఫక్రుద్దీన్, అల్లుడు మహబూబ్బాషా, చిన్న కుమార్తె షాను కలసి కారులో బెంగళూరుకు వైద్య పరీక్షల నిమిత్తం పయనమయ్యారు. సోమందేపల్లి మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామ చెరువు వద్దకు చేరుకొన్న సమయంలో బెంగళూరుకు చెందిన అఖిల్ ప్రతాప్ తన కారులో రొద్దం మండలం ఎల్జీబీ నగర్ వద్ద ఎస్టేట్కు వేగంగా ప్రయాణిస్తూ.. ముందువెళ్తున్న మరో కారును ఢీకొన్నారు.
ప్రమాదంలో ఆయన కారు అదుపుతప్పి జాతీయ రహదారి విభాగినిని ఢీకొని ముందుకు దూసుకెళ్తూ.. షేకూన్బీ కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న జాఫర్, మహబూబ్బాషా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. షేకూన్బీ, షాను, బాబా ఫక్రుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం షేకూన్బీ, కుమార్తె, కుమారుడిని అనంతపురం ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతూ కోలుకొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో తల్లి, కుమారుడు, అల్లుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు.