Papikondalu : పాపికొండల్లో పర్యాటకుల సందడి

పాపికొండల్లో పర్యాటకుల సందడి! పోచవరం బోట్ పాయింట్ వద్ద పర్యాటకుల రద్దీ. ప్యాకేజీ ధరలు, బోటింగ్ సమయాలు మరియు రాత్రి బస వివరాలు మీకోసం.

Papikondalu Tourism

విధాత : వరుస సెలవుల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు తాకిడి పెరిగింది. భద్రాచలానికి 70 కి.మీ. దూరంలోని పోచవరం బోట్ పాయింట్ నుండి సుమారు 3,000 మంది పర్యాటకులు గోదావరి అందాలను వీక్షించేందుకు బయలుదేరారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న భక్తులు, నేరుగా పాపికొండల సందర్శనకు వెళ్తుండటంతో బోట్ పాయింట్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో పర్యాటకులు విహరిస్తూ గడుపుతున్నారు. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్‌ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తున్నారు. గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను వీక్షిస్తూ సందర్శకులు పరవశిస్తున్నారు.

బోట్ పాయింట్ లు వివరాలు

పాపికొండల యాత్రకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్‌ వద్ద నుంచి బోట్‌లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండో బోట్ పాయింట్ తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్‌ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్‌ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి పాపికొండల యాత్రకు వెళ్లాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకుంటారు. ఇక్కడ సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్‌ పాయింట్‌ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరుతారు.

గోదావరిలో 70 కిలోమీటర్ల జలవిహారం

ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్‌ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అనుభవం పర్యాటకులు పొందవచ్చు. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్‌ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు.

బొంగు చికెన్ స్పెషల్

ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్‌ పాయింట్‌ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్‌’ అమ్ముతారు. పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.

ఇసుక తిన్నెల్లో రాత్రి బస

రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం బస గుడారాలు ఏర్పాటు చేశారు. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. బసతో కూడిన యాత్ర టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్‌ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని రక్షణ కోసం సిద్దంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

Wild Boar Attack : ఫారెస్టు ఆఫీసర్ పై అడవి పంది దాడి..వీడియో వైరల్

Anasuya | అన‌సూయ త‌గ్గేలా లేదుగా.. ట్రోల‌ర్స్‌కి కౌంట‌ర్‌గా స్విమ్ షూట్ వీడియో షేర్ చేసిన యాంక‌రమ్మ‌

Latest News